డియర్ వేణూ,
తలషేపు, మొహం షేపులతో కలిపి ఎలా చూసినా అందంగా కనిపించడమే ఫొటోజెనిక్ అని ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ పట్నాయక్ వల్ల ఈ మధ్యే తెలిసింది. ఈ ప్రకారం ఎన్ టి ఆర్ , మహేష్ బాబు 9 ఏంగిల్స్ లోనూ, నాగార్జున , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్ టి ఆర్ 8 ఏంగిల్స్ లోనూ ఎ ఎన్ ఆర్ 6 ఏంగిల్స్ లోనూ ….బాగుంటారు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ లగురించి మాట్లాడటంలేదు. వాళ్ళు మొహాలకు సర్జరీలు చేయించుకుసన్నారు కనుక.
బండముక్కు కారణంగా సైడ్ ఏంగిల్ లో ఫోటోలు అస్సలు తీయకూడని వారిలో కెసిఆర్ ఫస్ట్ అయితే నేను సెకెండ్..:)))))
ఇదంతా సరేగాని, మీ బ్లాగు చూస్తూంటేనే బాగుంది. మనసుకి హాయి అనిపించే అభిరుచులను ఆస్వాదిస్తున్నమీకు , ఆ ఆనందాన్ని అక్షరాలా మాకు పంచుతున్నందుకు కూడా అభినందనలు.
సునిశితమైన పరిశీలన,తపస్సు లాంటి దీక్ష మీ బ్లాగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పోస్టులో ఇందులో మొదటి రెండు లైన్ల డిస్ క్లయిమర్ లో చమత్కారం ఓ చిరునవ్వుని మొలిపిస్తుంది.
ఎన్ టి ఆర్ మొహమంత/ముక్కంత ఫొటో జెనిక్ గా వుంది మీ బ్లాగు
http://venuvu.blogspot.in/2013/05/blog-post.html
‘ఎంకి ఎవ్వరంటే ఎలుగు నీడల వైపు వేలు సూపింతు’ అంటాడు నాయుడు బావ. అలాంటి వెలుగు నీడలు, రాత్రీ పగలు ఒకే ఫ్రేములో కనబడుతున్న ఈ అపురూప దృశ్యాన్ని అంతరిక్షం నుంచి ‘కొలంబియా’ ఫొటో తీసింది. యూరప్ – ఆఫ్రికా ల మధ్య ఒక్క మేఘమూ లేని నిర్మలాకాశం లో సూర్యుడు అస్తమిస్తున్న(?) ఈ సన్నివేశంలో యూరప్ నిద్రపోతూండగా ఆఫ్రికా మేల్కొంటూ వుండటాన్ని చూడవచ్చు. ఎడమవైపు కనబడుతున్నది అట్లాంటిక్ మహాసముద్రం. కుడి వైపు చీకటిగా వున్నది యూరప్. దాని దిగువ తెల్లగా కనిపిస్తున్నది ఆఫ్రికా. దీపాలు వెలుగుతున్న యూరప్ లో హాలెండ్, పారిస్, బార్సిలోనా నిద్రపోతున్నాయి. అదే యూరప్ లోని డబ్లిన్, లండన్, లిస్టన్, మాడ్రిడ్ లలో ఇంకా చీకటి పడలేదు. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పగలూ రాత్రీ కనబడుతున్న ఈ సన్నివేశాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది శాస్త్రవిఙ్ఞానానికీ, సాంకేతిక పరిఙ్ఞానానికీ మనిషెత్తు సాక్ష్యం
ఆపదొచ్చినపుడు ఆదుకోలేని కిరణ్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏంచేయాలి??
క్రైసిస్ మేనేజిమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగావుపయోగపడుతుంది. మోడికి, బాబుకి వున్న ఈ అవగాహన కిరణ్ కు లేకపోవడం ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీలో ఒక స్ధావరం వుంది. చిన్నదో పెద్దదో ఒక యంత్రాంగముంది. ప్రభుత్వానికి శాటిలైట్ ఫోన్లున్నాయి. ఆఘమేఘాలమీద ఎక్కడికైనా వెళ్ళడానికి విమానాలున్నాయి. డబ్బు ఇబ్బందులున్నా ఆపదల్లో అక్కరకు రానంత దిక్కుమాలిన దరిద్రం మాత్రం లేదు.
ఉన్నదల్లా ఆలోచనల దరిద్రమే…ఉన్నదల్లా నిలువెత్తు ఉదాసీనమే…ఉన్నదల్లా మనవల్లకాదన్న అలక్ష్యమే!
ఉత్తరాఖండ్ వెళ్ళాలన్న మాటటుంచి అక్కడివిపత్తులో బతికిబయటపడి ఢిల్లీ లో ఆంధ్రాభవన్ చేరుకున్న తెలుగు బాధితులకు అధికారులు వసతులు ఏర్పాటుచేయలేకపోయారు భోజనానికి కూడా (మొదట్లో)డబ్బులు వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఎపి భవన్ కి ముందుగా వెళ్ళకపోవడమే ఈ దౌర్భాగ్యానికిమూలం.
కమ్యూనికేషన్ వ్యవస్ధ అద్భుతంగా వికసించిన కాలంలో కూడా ఇలాంటి నిస్సహాయ పరిస్ధితులు పదేపదే తప్పడంలేదంటే సదుపాయాల్ని – అవసరాలకు తగినట్టుగా సమన్వయం చేసుకోలేని వెనుకబాటుతనమో చేతగానితనమో నాయకుల్లో అధికారుల్లో పేరుకుపోవడమే మూలం. ఆలోచన అంటూవుంటే అమలుచేసే మార్గాలూ అవే క్యూలో నిలబడుతాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరు(సుమారుగా)యాత్రికులు చార్ ధామ్ యాత్రకు వెళ్ళారో ప్రభుత్వానికి స్పష్టతలేదు. ఇలాంటి సుదూర / అరుదైన యాత్రలకు వెళ్ళే వారిలో 90 శాతం మంది టూరిస్ట్ ప్యాకేజీలద్వారా , 10 శాతం మంది గ్రూపులుగానో బయలుదేరుతారు. టూరిస్టు సంస్ధలనుంచి ఆవివరాలు సేకరించడం పెద్ద విషయం కాదు. జిల్లాకొక టోల్ ఫ్రీ నంబరు పెట్టి యాత్రకు వెళ్ళిన కుటుంబాల వారినుంచి యాత్రీకుల వివరాలు సేకరించడం కష్టం కాదు. ఈ ఏర్పాట్లు జరగాలేకాని గంటలవ్యవధిలోనే మొత్తం సమాచారం తెలియజెప్పే మొబైల్ ఫోన్లు, సమాచారాన్ని విశ్లేషించే కమ్యూనికేషన్లు మనకున్నాయి. ఎటొచ్చీ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చన్న బుద్ధీ జ్ఞానాలే ముఖ్యమంత్రి మొదలు ఆయనకు సలహాలు ఇచ్చే సీనియర్ అధికారుల వరకూ ఎవరికీలేవని అర్ధమౌతోది
ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీతోనే సమస్యలు పరిష్కారం కావు. సమస్య తీవ్రతను తెలుసుకోడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా వుపయోగపడుతుంది. దాన్ని వినియోగించుకుని ఎలా పనిచేయాలన్న దృష్టి నాయకులకూ అధికారులకూ వుండాలి.
ఒడిషా తుఫాను విపత్తులో ఆదుకోడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మన అధికారులను పంపారు. పనిలో మన బృందాల అవగాహనను, ఐటి తోట్పాటుని ఒడిషా ముఖ్యమంత్రే ప్రస్తుతించారు
ఇపుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్ళారు రెండు విమానాల్లో ఆరాష్ట్రం బాధితులను వెంటతీసుకువెళ్ళారు. రెండు విమానాలతో సమస్యమొత్తంతీరిపోదు.ముఖ్యమంత్రే స్వయంగా బాధ్యత తీసుకోవడం అధికారుల నిమగ్నతను పెంచుతుంది.
గుజరాత్ అధికారులకు వారిరాష్టా్రనికి చెందిన బాధితుల మీద ఒక అవగాహన వుండటానికి ప్రధాన కారణం నాయకత్వమే అయితే రెండోకారణం ఐటి కల్పించిన అవగాహనే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్వయంగా వెళ్ళలేకపోయినా బాధితులకు ఢిల్లీ ఎపి భవన్ లో ఉచిత భోజన వసతులు కల్పించడంతో బాటు విమానాలుకాకపోయినా ప్రత్యేక రైలుబోగీలైనా ఏర్పాటుచేయించలేక పోవడం దారుణం. కనీసం రైలుటికెట్టు ఏర్పాటుచేయగలిగినా బాధితులకు పెద్ద ఉపకారమే అవుతుంది.
కష్టకాలంలో ప్రభుత్వం ఏంచేయాలో చంద్రబాబుకి అవగాహనవుంది. (కమ్యూనికేషన్ వ్యవస్ధ ఇపుడున్నంత గాలేని)1996 తుపాను సమయంలో ఆయన ప్లానింగ్, ఫాలో అప్ ల విశ్వరూపాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో జర్నలిస్టులు అతిసమీపంనుంచి చూశారు. ఇంప్లిమెంటులో అక్కడక్కడా లోపాలు వుంటే వేరేసంగతి.
ఢిల్లీ ఎపిభవన్ లో చంద్రబాబు ధర్నాచేయడం అక్కడి ఏర్పాట్లు పరిస్ధితులపై తీవ్రమైన నిరసనగానే అర్ధమౌతోంది. రాజకీయాధికారమే ఆయన లక్ష్యం కావచ్చు..అంతమాత్రాన ప్రభుత్వ వైఫల్యంమీద అసహనాన్ని వ్యక్తం చేస్తే అదికూడా రాజకీయమంటే ఎలా? (మాట వరసకి ఇదీ రాజకీయమే అనుకుందాం! రాజకీయవేత్తలు రాజకీయాలు మానేసి కబాడీ క్రికెట్టు ఆడరు కదా! గుజరాత్ ప్రభుత్వం లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అకేషన్ కి రైజ్ అయివుంటే తిట్లు, శాపనార్ధాలూ, ధర్నాలు వుండవు కదా!)
అద్భుతమైన కమ్యూనికషన్లున్న 2013 లో అసలు క్రైసిస్ మేనేజిమెంటు ప్లానే లేని కిరణ్ కుమార్ ప్రభుత్వం నెత్తిమీదుండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే!
టివి, మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోలేని ఎలకా్ట్రనిక్ “వ్యసన”పరులమైపోయాం. లాప్ టాప్ లాంటి నానారకాల గాడ్జెట్టుల్నీ వ్యసనాల జాబితాలో చేర్చేసుకుంటున్నాం. మనుషులు దూరమైపోతున్నా వస్తువులే లోకమై బతికేస్తున్నాం. గ్లోబలీకరణనవల్ల హద్దులు చెరిగిపోయి ప్రపంచం 24 గంటల దూరానికి దగ్గరైపోయిందని మురిసిపోతున్నాం . . నాణ్యమైనవాటిని ధరతక్కువైన వాటిని ఏమూలలున్నా పట్టుకుని వాడుకోవచ్చని ఆన్ లైన్ హొయలు పోతున్నాం.
అయితే పతనమౌతున్న రూపాయి విలువని నిలువరించలేక గాడ్జెట్ ‘వ్యసనాల’ ధరాభారాన్నితట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్న గ్లోబల్ సామాన్యులమైపోతున్నాం
రూపాయి పతనం ఆర్థికవ్యవస్థే కే కాదు అందరి జేబులకూ చిల్లు పెడుతోంది. భారీగా తగ్గుతున్న రూపాయి విలువతో దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇందులో మనం నిత్యం వాడే వస్తువులు కూడా ఉన్నాయి.
గత రెండేళ్ల కాలంలో రూపాయి విలువ 30 శాతం పతనమయింది. మే నెల నుంచి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే తగ్గింది. రెండేళ్ల కిందట 43 రూపాయిలుగా ఉన్న రూపాయి మారకపు విలువ మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58 రూపాయిల 39 పైసల వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది.
ఈ పతనం నానారకాలుగా ప్రభావం చూపుతోంది. దిగుమతుల బిల్లు పెరుగుతుంది. ఫలితంగా మనం వాడే కొన్ని వస్తువల ధరలు ప్రియం కానున్నాయి
కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, ట్యాబెట్ లు, స్మార్ట్ ఫోన్లు,కార్లు, టీవిలు, ఇంపోర్టెడ్ లిక్కర్,ప్రీమియం పుడ్, లగ్జరీ ఐటమ్స్ ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత రూపాయి పతనంతో దిగుమతి చేసుకుంటున్న కన్జూమర్ గూడ్స్ ధరలు 20 నుంచి 25 శాతం ప్రియం కానున్నాయి. రూపాయి విలువ ఒక్క శాతం తగ్గితే ఇంపోర్టెడ్ పుడ్ విలువ 3 నుంచి 4శాతం వరకు పెరుగుతుంది. అదే లిక్కర్ ధర 6 శాతం,గృహోపకరణాల ధర 2 నుంచి 3 శాతం వరకు పెరుగుతుంది. ఇక విదేశీ ప్రయాణం మరింత ఖరీదు కానుంది.ఫారిన్ టూర్ ప్యాకేజీల ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని వస్తువులపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెలఖారులోగా తమ కంప్యూటర్లపై ధరలను 5 నుంచి 8 శాతం పెంచుతున్నట్లు లెనోవా తెలుపగా, 10 శాతం వరకు పెంచుతున్నట్లు ఏసర్, 8 శాతం పెంచుతున్నట్లు హెచ్ సీఎల్ ప్రకటించింది.
రకరకాల ఎల్ట్రకానిక్ ఉపకరణాల ధరలను ఈ నెలఖారులోగా 2 నుంచి 5 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ఎల్ జి, సాంసంగ్, పానసోనిక్ లు తెలిపాయి.
ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాక ఇది రాస్తున్నాను
అప్పుడు నేను తిరుపతి ఈనాడు ఎడిషన్ మఫిషియల్ డెస్క్ ఇన్ చార్జని. కెఎన్ వై పతంజలి గారు జనరల్ డెస్క్ ఇన్ చార్జ్….ఆరోజురాత్రి 7 గంటల ప్రాంతం…బోయ్ ఏకాంబరం వచ్చి ప్రకాష్ సార్ పిలుస్తున్నారంటే జనరల్ డెస్క్ కి వెళ్ళా. షిఫ్ట్ ఇన్ చార్జ్ ప్రకాష్ ఫస్ట్ ఎడిషన్ డ్యూటీ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ ఇన్ చార్జ్ రామశేషుగారు నైట్ ఎడిషన్ల డ్యూటీకి వచ్చేశారు. సబ్ ఎడిటర్లు రామశేషుగారు, ప్రకాష్ గారు, విలాసిని గారూ గంభీరంగా వున్నారు.
శ్రీశ్రీ మద్రాస్ లో పోయారు. వార్తతెప్పించండి అని ఓ టెలిప్రింటర్ మెసేజ్ నా చేతికిచ్చారు. అది విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చింది. శ్రీశ్రీ మరణవార్తను చలసాని ప్రసాద్ గారు ఫోన్ లో చెప్పారు. వార్తతెప్పించండి అని అందులోవుంది.
మద్రాస్ లో సితార కు మిక్కిలినేని జగదీష్ బాబు రిపోర్టర్. మద్రాసు ఈనాడు ఆఫీస్ కి జగదీష్ బాబు ఇంటికీ, ఆరుద్రగారి ఇంటికీ(నెంబరు ప్రకాష్ ఇచ్చారు) ట్రంకాల్ బుక్ చేశాను. (బహుశ ఈ విషయం ప్రపంచానికి నేనే చెప్పాలన్న బాధ్యత అధికారాలను ఒలకబోస్తూ) ప్రెస్ కాల్ అర్జంట్ అని ఆపరేటర్ నిఅడిగాను. విషయం చెప్పాను. శ్రీశ్రీ ఎవరు అని అతను అడిగాడు.
జగదీష్ బాబు రిపోర్టు ఇవ్వగలరన్న నమ్మకమైతే నాకులేదు. యు ఎన్ ఐ ఏజెన్సీ కాపీకోసమే చూడాలి అని ప్రకాష్ తో అంటే పక్కనే వున్న రామశేషుగారు ఏం ఫరవాలేదు మనవాళ్ళు రాసేస్తారు అన్నారు.
అంతలో కరెంటుపోయింది. ఎవరో “మహాప్రస్ధానం” పుస్తకాన్ని తీసుకు వచ్చారు. కొవ్వొత్తి వెలుగులో శర్మ ఒకో కవితనీ బిగ్గరగా చదువుతూంటే నా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాట్ల నారాయణ మూర్తిరాజు కావలసిన లైన్ లను నోట్ చేసుకున్నారు. నా డెస్క్ లో కళత్తూరు సుధాకరరెడ్డి బయటికి వెళ్ళి ఎక్కడినుంచో ఖఢ్గసృష్టి పుస్తకం తెచ్చి ప్రకాష్ కి ఇచ్చారు
ఆరుద్రగారినుంచి కాల్ వచ్చింది నేను రాసుకుంటూనే సైగచేసేస్తే ఏకాంబరం వెళ్ళి ప్రకాష్ ని తీసుకువచ్చారు. ఆయన సంతాపసందేశాన్ని పూర్తిగా రాసుకున్నారు.
ఇంతలో నా డెస్క్ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు ఓ రిపోర్టు రాసుకొచ్చాడు. శ్రీశ్రీ మరణానికి ఆకాశం బోరున ఏడుస్తోందని…అప్పటి వరకూ బయట పెద్దవాన పడుతోందన్న స్పృహే మాకెవరికీ లేదు. ఆరిపోర్టుని కంపోజింగ్ కు ప్రకాష్ పంపించారు.
శ్రీశ్రీ గారి కవితలనే కోట్ చేస్తూ మరణవార్తను దాట్లనారాయణ మూర్తిరాజు రాశారు. చర్చించుకుని చిన్న మార్పులు చేశారు మొత్తం కాపీ 25/30 పేజీలు వచ్చింది. శర్మ, సత్యనారాయణా ఇతర ఎడిషన్లకు పంపడానికి ఇదంతా టెలిప్రింటర్లలో టైప్ చేశారు.
అది లెటర్ కంపోజింగ్ ఫోర్ మన్ నారాయణ గారు అనేకమంది కంపోజిటర్లకు వార్తను విభజించి యిచ్చి శరవేగంతో కంపోజింగ్ చేయించారు. మామూలుగా ఇచ్చే ప్రూఫ్ గ్యాలు రెండయితే ఆసారి పదో పదిహేనో తీసి అందరికీ ఇచ్చారు.
నా డెస్క్ లో శశాంక్ మోహన్, సుధాకరరెడ్డి, మునిమోహన పిళ్ళే జిల్లాల వార్తలు ప్రచురణకు తిరగరాయడంలో నిమగ్నమైవున్నారు.
ఇంతలో మేనేజర్ నుంచి నాకు ఫోన్ కాల్ “వార్తలు ముఖ్యమే కాని అవసరంమేరకే ట్రంకాల్స్ బుక్ చేయమని” సలహాలాంటి అధికారాన్ని చూపిస్తూ…(మేనేజర్లు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇలాగే వుంటారేమో) నాకు చికాకు వచ్చి ఇంకో ఫోన్ వచ్చింది తరువాత మాట్లాడుతానని పెట్టేశా!
హైదరాబాద్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డునుంచి వర్మగారు నాకు ఫోన్ చేసి “ఎట్టి పరిస్ధితుల్లోనూ మాస్ట్ హెడ్ (ఈనాడు లోగో) దించడానికి వీల్లేదని చెప్పు” అన్నారు. రేపు మీ ఎడిషన్ కే మార్కులు వస్తాయి బ్యేలెన్స్ మెయింటెయిన్ చేయండి అన్నారు.
మాస్ట్ హెడ్ కూడా దించవచ్చుకదా తట్టనేలేదు అంని ప్రకాష్ అంటే నవ్వుకున్నాము. అపుడు రామశేషుగారు – బ్యానర్ వార్తేగాని మాస్ట్ హెడ్ దించవలసింది కానేకాదు అని తెగేసి చెప్పారు. (ఆ ఎడిషన్ రామశేషుగారు ఇవ్వవలసింది. ప్రకాష్ బృందం ఉద్వేగాన్ని గౌరవించి వారికి బాధ్యతలు అప్పగించేసి పక్కనే వుండి మొత్తం పరిస్ధితిని ఫాలోఅవుతున్నారు.
“మహాకవి శ్రీశ్రీ మహాప్రస్ధానం” అని బ్యానర్ రాశారు.ఇది అందరికీ అర్ధమౌతుందా అని నాకు అనుమానమొచ్చంది. ఈ అనుమానాన్నే శర్మ అడిగితే “శ్రీశ్రీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది అర్ధమౌతుంది” అని రామశేషుగారు రూలింగ్ యిచ్చారు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రకాష్, దాట్ల, రామశేషు గార్లదే యాక్టివ్ రోల్. డెస్క్ ఎదురగా దూరంగా వుండే ఇన్ చార్జ్ సీటులో పతంజలిగారు కూర్చుని కొవ్వోత్తి వెలుగులో ఆలోచిస్తూ రాసుకుంటున్న రూపం మెదులుతున్నట్టువుంది. మామూలుగా ఫస్ట్ ఎడిషన్ పేజీలు ఇచ్చేశాక పతంజలి వెళ్ళిపోతారు. ఆరోజు ఆయన తిరుపతి టౌన్ కి వెళ్ళారనీ(ఎడిషన్ ఆఫీస్ రేణిగుంటలో వుంటుంది) ఫలానాఫలానా చోట వుండొచ్చనీ రిపోర్టర్ వల్లీశ్వర్ గారికి ఫోన్ చేసి పతంజలిగారికి కబురందేలా చూడాలనీ ప్రకాష్ గారు నన్ను అడిగినట్టు లీలగా గుర్తుంది..లేట్ గా ఆయన వచ్చారో లేక రాలేదో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అయితేవార్త మొత్తం కాపీ తయారు చేసింది దాట్లగారే! మెరుగులు దిద్దింది ప్రకాష్ గారే! తుదిమెరుగులన్నీ పతంజలిగారివేననీ, ఆయన విజయవాడ న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారూ చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారనీ నాకు లీలగా గుర్తొస్తోంది. శర్మ మాత్రం ఆ రాత్రి పతంజలిగారు కనబడలేదని గట్టిగాచెబుతున్నారు. నేనైతే దాట్ల ముడి సరుక్కి ఉద్వేగాన్ని అద్దింది పతంజలిగారేనని గట్టిగా నమ్ముతున్నాను
విజయవాడ, విశాఖ, హైదరాబాద్, ఎడిషన్లకు కూడా తిరుపతి ఎడిషన్ వార్తే బ్యానర్ అయితే డిస్పేలు మాత్రం వేరువేరుగా వున్నాయి.
ఎడిషన్ అయిపోయాక చాలాసేపు వుండిపోయాము. టీలు సిగరెట్లూ తీసుకురావడానికి ఏకాంబరం ఆరోజు కనీసం 60/70 సార్లయినా పైకీ కిందికీ తిరిగివుంటాడు.
మూడోరోజుకల్లా చైర్మన్ గారి(రామోజీరావుగారు) కామెంట్స్ వచ్చాయి. “బాగుంది. శ్రీశ్రీ కుటుంబ వివరాలు లేవు.సామాన్యపాఠకులకు ఈ వార్త అర్ధమౌతుందా” అని పేపర్ మీద పచ్చసిరాతో ఆయన రాశారు.
వార్తకు ఒక ఫార్మేట్ వుంటుంది. దాన్నిపక్కన పెట్టి శ్రీశ్రీగారి జీవితాన్ని మరణం వరకూ ఆయన పద్యాలతోనే వివరించిన ఉద్వేగపూరితమైన ఆ కథనం అనుకుని గాక యాధృచ్చికంగా జరిగిందే. అది ఈనాడుకి మంచిపేరు తెచ్చింది. అందులో రాసినవారి ఎమోషన్ తోబాటు కవిత్వాన్ని మామూలు మనిషి ఆలోచనల్లోకి తెచ్చిన శ్రీశ్రీముద్రలో లోతులుకూడా వున్నాయి.
73 ఏళ్ళు జీవించిన శ్రీశ్రీ మరణించి ఇవాల్టికి(16/6/13 నాటికి) సరిగ్గా 30 ఏళ్ళు. ఆయన 30/40 ఏళ్ళవయసులో రచనా వ్యాసాంగం ఉధృతంగా సాగింది..ఆయన మరణించిన నాటికి పుట్టిన వారి వయసు 30 ఏళ్ళు వారిలో ఏకొందరికో శ్రీశ్రీ పేరుతెలుసు.అయన చురుగ్గా రాస్తున్న కాలంలో పుట్టిపెరిగిన నా వయసు వాళ్ళమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీశ్రీ ప్రభావంగట్టిగావుంది. నా ఏజ్ గ్రూప్ లో వున్న వాళ్ళలో ఒక్కసారైనా కవిత్వం రాయని వారు వుండరు. అది శ్రీశ్రీ ముద్రే! ఈ ముద్రే ఈనాడుకి “మహాకవిశ్రీశ్రీ మహాప్రస్ధానం” చాలాకాలం గొప్ప స్కోరై మిగిలింది
ఆంధ్రజ్యోతి ABN టివి ఈ రోజువుదయం నుంచి గోలగోలగా ఒక సెటిల్మెంటు కథనాన్ని చెబుతోంది. ఇందులో నాకు అర్ధమైన అంశాలు-
1) కెసిఆర్ కొడుకు కెటిఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ వాళ్ళ వాళ్ళ అనుచరులతో ఎవరో ఒక కాంటా్రక్టర్ ను ఎత్తుకుపోయి చితకబాది 87 లక్షలరూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి బదిలీ చేయించుకున్నారు
2) అదే పనిగా విసిగిస్తున్న ఈ కథనం స్పస్టంగాలేదు.అర్ధమయ్యేలా లేదు. ఛానల్ వాళ్ళ వెర్రి ఉత్సాహపు వ్యాఖ్యానాలు, వర్ణనలు అసలు విషయాన్ని పక్కదారిపట్టిస్తున్నట్టు అనిపిస్తోంది
3) ఉద్రేకంవల్ల జరిగే హింసను అర్ధంచేసుకోవచ్చు. అధికార/పలుకుబడులను అడ్డంపెట్టుకుని డబ్బుకోసం మనుషుల్ని హింసించడం దారుణం
4) చావుదెబ్బలు తిని 87 లక్షలు బదిలీ చేసిన వాడి మీద సానుభూతి రావాలి …కాని నాకు సానుభూతి కలగడంలేదు. 35 ఏళ్ళ కష్టపడి ఒక పద్ధతిగా బడ్జెట్ లో సదుపాయంగా జీవిస్తున్న నాకు 87 లక్షలరూపాయలు ఊహకు అందడంలేదు. మరోవైపు అడ్డగోలుపనులకు లక్షలు కోట్ల రూపాయలు బదిలీ చేసేసి అదేవ్యక్తులు అన్యాయమైపోతున్నామని ఏడవడం చికాకుగావుంది
బహుశ మా బాగా అయ్యిందన్న భావన కూడా నాలో మొదలైందో ఏమో! ఇందువల్లే లక్షలు కోట్లు పోగొట్టుకున్న వారిపట్ల సానుభూతి కలగడం లేదేమో!
నూరుగొడ్లనుతిన్న రాబందు గాలివానకు పోతుందన్నది అనే సామెత నిజమే అనిపిస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసించి ఇలా డబ్బుచేసుకునే రాజకీయవేత్తలు వరుసబెట్టి జైలుకి వెళ్ళడం కూడా మనం చూస్తూనే వున్నాం
5) తప్పు ఎవరు చేసినా నిలదీయాలి-ఎవరు అన్యాయంగా బాధపడినా సానుభూతి కలగాలి ఈ విలువ పతనమైపోడానికి మూలం విపరీతంగా పెరిగిపోతున్న ఆర్ధిక అసమానతలే!
6) డబ్బున్న వాళ్ళని ద్వేషించే పరిస్ధితి సామాన్యుల్లో వ్యాపించడం సమాజశ్రేయస్సుకే హానికరం
Recent Comments