రాష్ట్రాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడంలో భాగంగా స్మార్ట్ వార్డు, స్మార్ట్ డివిజన్, స్మార్ట్ విలేజ్, అంతిమంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యం సాధనదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్మార్ట్’ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని వేలివెన్ను గ్రామంలో దీన్ని లాంఛనంగా ప్రారంభించి 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అత్యుత్తమ విధానాల అమలు చేయాలని, ఇందులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయడం ఇందులో ప్రధానాశం..
అభివృద్ధి కోసం ఎవరివైపో చూడాల్సిన అవసరం లేకుండా తమకున్న వినూత్న ఆలోచనలు, వనరులతో గ్రామీణ ప్రజానీకం ప్రణాళికలు రూపొందిస్తే వాటి అమలుకు అవసరమైన ఆర్థిక, ప్రణాళికాబద్ధమైన సాయం అందించే బాధ్యతను భాగస్వాములపై పెడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామాలు, 3,465 వార్డులను ఐదేళ్లలో స్మార్ట్గా తయారుచేయాలనే సంకల్పం పెట్టుకున్నారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన, ఆర్థిక అసమానతలులేని సమాజాన్ని నిర్మించడమే ఆకర్షణీయ గ్రామం, వార్డుల లక్ష్యం. అందుబాటులో ఉన్న వనరులు, సమస్యలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీ, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, విద్య, పౌరసరఫరాలు, తదితరాలకు చెందిన యంత్రాంగం ఇందులో ఉంటాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ప్రతి గ్రామంలో జన్మభూమి- మావూరు కమిటీలు ఉంటాయి. మంత్రులు, ఎఎెు్మల్యేలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ గ్రూప్ అధికారులు ఒక్కో గ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుంటారు. సామాజిక బాధ్యత కింద పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, గ్రామం బయట నివాసం ఉండేవారు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఇప్పటికే ముందుకు వస్తున్నారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు వీలుగా 60 రోజుల్లో దరఖాస్తు చేసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఒకరికంటే ఎక్కువ మంది ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే వారి పూర్వాపరాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుంది. ఒక లీడ్ భాగస్వామి (పార్టనర్)ని ఎంపిక చేసే అవకాశముంది.
ప్రతి కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కల్పించడం, బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేట్లు చూడడం, పిల్లలకు పౌష్టికాహారం, మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యం, మాతా శిశుమరణాల తగ్గింపు, వంద శాతం అక్షరాస్యత సాధించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
రాష్ట్రంలో ఏదైనా గ్రామంలో ఒక వినూత్నఆలోచన, ఒక స్మార్ట్ కార్యక్రమం చేసి ఫలితంగా పదిమందికి ఉపాధి, పదిమందిలో చైతన్యం, పదిమందికి విద్య ఇలా ఏదైనా అందిస్తే తక్షణం ఆ విషయాన్ని రాష్టస్థ్రాయిలో ఉండే సమన్వయ కమిటీ స్వీకరిస్తుంది. ఆ విజయాన్ని రాష్ట్రంలోని మిగతా అందరికీ చెప్తుంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయనున్న పోర్టల్లోను పొందుపరుస్తుంది. గ్రామ స్థాయిలో వచ్చే వినూత్న ఆలోచనల అమలుకు వివిధ శాఖల మధ్య సమన్వయం చేయాల్సి వస్తే ఆ బాధ్యతను రాష్ట్ర స్థాయి సమన్వయ సంఘం తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు ఈ కమిటీకి ఛైర్మన్గా ఉంటారు. పంచాయతీల్లో పంచాయతీరాజ్శాఖ, వార్డుల్లో పట్టణాభివృద్ధి శాఖలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయి. వ్యవసాయం, వైద్య, కుటుంబ సం క్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, విద్య, పౌర సరఫరాలు తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి ప్రణాళికా విభాగం కన్వీనర్గా వ్యవహరిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటుచేసే సమన్వయ కమిటీలకు ఎప్పటి కప్పుడు విధి, విధానాలను ఈ కమిటీ నిర్దేశిస్తుంది.ఇందులో జిల్లా కలెక్టరు కీలక పాత్ర పోషిస్తారు.
స్థానిక ప్రజల విజ్ఞానం, నైపుణ్యాలు, సమర్ధత లను తక్కువగా చూడకూడదు. స్థానిక ప్రజల ఆలోచనలు, పద్ధతులు, స్థానిక నమ్మకాలను విమర్శించకూడదు. ఎవరిని బెదిరించకూడదు. ఈ పథకం అమలు తీరును మదింపు చేసేందుకు 19 సూచికలు ఏర్పాటు చేశారు.
1.ప్రతి కుటుంబానికి జీవనభృతికి అవసరమైన పని ఉండాలి. లేకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే అవకాశాలు కల్పించాలి. 2. అందరికీ ఇళ్లు, సురక్షితనీరు, విద్యుత్ ఉండాలి. 3. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి. బహిరంగ మలవిసర్జన చేయకూడదు. 4. ప్రసవాలు అన్నీ ఆసుపత్రుల్లోనే జరగాలి. 5. శిశు మరణాలు అసలే మాత్రం ఉండకూడదు. 6. ఏడాదిలోపు శిశవులు వైద్యం అందక మరణించ కూడదు. 7. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందాలి. 8. ప్రస్తుతం పాఠశాలలకు వెళ్తున్న బాల, బాలికల్లో ఇంటర్మీడియట్ లోపు చదువు మానేసిన వారు ఉండకూడదు. 9. అంగన్వాడీకేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, గ్రామపంచాయతీ భవ నాల్లో వాడుకలో ఉండేలా మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్ ఉండాలి. 10. ఏడాదిలో నాలుగుసార్లు గ్రామ, వార్డు సభలు జరగాలి. ఆ గ్రామం, వార్డుల్లో ఉన్న మూడింట రెండొంతుల మంది హాజరుకావాలి. 11. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలి 12. ప్రతి పొలానికి భూసారపరీక్ష కార్డు ఉండాలి. పశపోషణ, వైవిధ్యమైన చెట్ల పెంపకం చేపట్టాలి. 13. ప్రజలందరి భాగ స్వామ్యం తో తయారుచేసిన అభివృద్ధి ప్రణాళిక ఉండాలి. 14. గ్రామం, వార్డు సరి హద్దుల మొత్తం పచ్చని చెట్లు పెంచాలి. 15. నీటి సంరక్షణ, నీటి నిల్వ నిర్మాణాలు ఉండేలా చేయాలి. 16. వివాదాలు, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక పద్ధతి ఉండాలి.
17. గ్రామ సమాచార కేంద్రం, కంప్యూటర్ ల్యాబ్, మీ సేవ కేంద్రం ఉండాలి.18. ఇంటర్నెట్ అనుసంధానత ఉండాలి. 19. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఉండాలి.
స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద విశాఖ జిల్లాలోని అరకు గ్రామాన్ని చంద్ర బాబునాయుడు దత్తత తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు ఎన్టీరామారావు స్వగ్రామం నిమ్మకూరును తెలుగుదేశం యువనాయ కుడు లోకేష్ దత్తత తీసుకున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామమైన కొమరోలు (కృష్ణా జిల్లా)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. తన స్వగ్రామం నారావారిపల్లిని తన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకోనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గ్రామాలు, వార్డుల దత్తతకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, ఎన్జీవోలు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
బాబు స్ఫూర్తితో అన్నవరం గ్రామాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు, గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు దత్తత తీసున్నారు. స్వగ్రామం ఓంు్టవాయిని మంత్రి పల్లె రఘు నాధరెడ్డి, పశ్చిమ గోదావరిలోని సీతారాంపురంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, విజయవాడలోని మొగల్ రాజపురం వార్డును దత్తతుకు ఎంపిక చేసుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులు వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొరిమెర్ల గ్రామాన్ని కెనడాకు చెందిన ప్రవాసాంధ్రుడు నవీన్ చౌదరి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలను వీటీపీఎస్, ఇబ్రహీంపట్నం మం.జూపూడి గ్రామాన్ని నిమ్రా కళాశాల దత్తత తీసుకున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో పలు గ్రామాలను క్రికెట్ దిగ్గజం టెండూల్కర్, కేంద్ర మం త్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీలు కొణకళ్ల నారా యణ తదితరులతోపాటు ఎమ్మెల్యేలు పలువురు స్మార్ట్ గ్రామం రూపకల్పన దిశలో ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లోని తన స్వగ్రామమైన మైైజారుగుంటను గృహ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) ఢిల్లీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మేడిది రవికాంత్ దత్తత తీసుకున్నారు. రూ. 80 లక్షల కేంద్ర ప్రభుత్వ ప్రత్యేకనిధులతో కాలిబాట వంతెన, రహదారి, డ్రైన్లు వంటి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీయస్ఆర్) నిధులతో పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇదేరీతిలో మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి బాటలు వేయనున్నాయి. ఇక నుంచి సృజనాత్మకత, నవీకరణలు అభి వృద్ధి ప్రక్రియను స్మార్ట్ వార్డు, స్మార్ట్ డివిజన్, స్మార్ట్ విలేజ్లను కొత్త అంచులకు తీసుకెళ్ళాల్సి ఉంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రం, దేశంలోని పలు గ్రామాలు సాధిం చిన ఘనతను గుర్తుకు తెచ్చుకోవడం ఉత్తమం. వరంగల్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగదేవిపల్లి గ్రామం బాల వికాస సామాజిక సేవా సంఘం అనే స్వచ్ఛంద సంస్థ స్థానిక ప్రజలతో కలిసి గంగదేవిపల్లె ప్రయోగాన్ని విజయవంతం చేసింది.13 వేల జనాభా గల ఈ గ్రామం సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. ఇతర మానవాభివృద్ధి సూచీల్లో ఎంతో ముందడుగు వేసింది. ఆదర్శగ్రామంగా గంగదేవిపల్లి ఎదగడానికి 15 ఏళ్ళు పట్టింది.2014 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్పూర్తి దాయక గ్రామాల్లో గంగదేవిపల్లి ఒకటికాగా మిగతా రెండూ పున్నారి (గుజరాత్), హివారి బజార్(మహారాష్ట్ర)లు ఉన్నాయి.
సమిష్టి కార్యాచరణలో పాల్గొన్న అనుభవం, స్థానిక వైరుధ్యాలను పరిష్కరించుకున్న చరిత్ర ఉన్న గ్రామాలను ఈ పథకంలో మమేకం చేయాలి. రాజకీయ, కుల, మత బేధాలతో చీలిపోకుండా ప్రజల మధ్య సమష్టి తత్వం, ఐక్యత ద్వారానే గ్రామాల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి.చురుకైన ప్రజా భాగస్వామ్యం స్వచ్ఛంద సేవలతో నడిచే ఉదాత్త పథకం కావాలి.పథక లక్ష్యాలకు అణుగుణంగా రూపొందే గ్రామాలు పొరుగు పల్లెలకు స్ఫూర్తినిచ్చి అన్నింటిని అభివృద్ధి మార్గం పట్టించాలి. సమర్థ భూ, జల విధానం, సురక్షిత తాగునీటి సరఫరా, పారివుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆస్పత్రి, విద్య జీవనోపాధి వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉన్నప్పుడే అవి ఆదర్శ గ్రామం అనిపించుకుంటాయి.