కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను సృ్పశించే సామూహిక క్రతువే గోదావరి పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. నా ఉనికికి మా కుటుంబ ఉనికికి క్షేతా్రలు బీజాలు అయిన నా తల్లిదండ్రులు, అత్తమామలు, వారి పెద్దల పట్ల ఒక భక్తి శ్రద్ధలు వ్యక్తపరచడానికి తొమ్మిదోరోజు అయివుండటం వల్ల అన్న శా్రద్ధం పెట్టాను. పూర్వీకుల పేరు నిలబెట్టేది దానమో, ధర్మమో, సంతానమో కనుక ఏదో ఒకటి అయివుండాలి కనుక వారసుడిగా ఒక బాధ్యత నిర్వర్తించానన్న సంతృప్తి మిగిలింది.
గతరాత్రి చాలా సేపు పెద్దలతో నా కున్న జ్ఞాపకలు గుర్తువచ్చాయివారిపట్ల నేను అనుచితంగా ప్రవర్తించిన కొద్ది పాటి సందర్భాలు తలపునకు వచ్చాయి. క్షమాపణలు చెప్పడానికి వారెవరూ లేకపోవడం కొంత దు:ఖానికి కారణమైంది.ఈ ఉద్వేగం పేరు
పరితాపమో పశ్చాత్తపమో! ఇలా హృదయాన్ని స్వచ్ఛపరచుకున్నాక నదీ స్నానంతో లౌకికమైన క్రతువుని కూడా పూర్తి చేయాలనిపించింది.
సర్ ఆర్ధర్ కాటన్ గారికి నా తండ్రి పెద్దాడ రామచంద్రరావుగారికి ఇతర కుటుంబ పెద్దలకు పిండ ప్రధానాలు చేయాలన్నాను. కాటన్ గారిగురించి కొత్తగా చెప్పనవసరంలేదు. నాతండ్రిగారు యోధుడు,త్యాగి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించిన హీరో. మిగిలిన వారందరూ కుటుంబాలకు మూల స్ధంభాలు. అయితే ఈ ఆర్డర్ లో పిండప్రధానం కుదరదని బ్రాహ్మణుడు తేల్చేశారు. నాతండ్రి, ఆయన తండ్రి ఆయన తండ్రి, నా తల్లి…నా మామ ఆయన తండ్రి, ఆయన తండ్రి, నా అత్త…ఆతరువాతే కాటనైనా మరెవరేనా అని వివరించారు. రాజమండ్రి వచ్చి ఇతరుల సమన్వయలోపం వల్ల అన్యాయంగా పుష్కరాల్లో చనిపోయిన వారి కి కూడా పిండాలు వెయ్యడం వీలుకాలేదు. వారి కుటుంబీకులు ఇపుడు చావు మైలలో వుంటారు కనుక ఇపుడు వారికీ శా్రద్ధాలు పెట్టడం కుదరదు అన్నారు.
గోత్రనామాల దగ్గర మళ్ళీ చిన్న హర్డిల్…నా గోత్రం చెప్పగానే జంధ్యం ఏదీ అని అడిగారు. మానాన్నగారు నాస్తీకుడు అయి వుండటం వల్ల నాకు వొడుగు చేయించని సంగతి చెప్పాను. సరే శూద్రుడికి చేసినట్టే చేస్తాను అన్నారు. మామగారి గోత్రం చెప్పినపుడు ఇంటర్ కేస్టన్నమాట అన్నారు. దీనికి రెమిడీ వుంది పుష్కరాల తరువాత కలవండి అదీ ముగించేద్దాం అన్నారు. సరే అన్నాను (ఇలా చాలాసార్లయింది. నేను వెళ్ళిందీ లేదు..వెళ్ళేదీ లేదు)
ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారమే మా కుటుంబాల పెద్దలకు ఇతరుల కోటాలో కాటన్ గారికీ పిండప్రధానం చెశాను.
ఉనికి గీసిన గిరులు దాటి వ్యక్తిత్వాలను విస్తరించుకున్న మనుషులను కాలమే గుర్తుంచకుంటుంది. వారిముద్రలు అంత తేలికగా చెదరవు, చెరగవు.
బాటచేసిన వారినీ, దారిచూపిన వారినీ మరచిపోము. స్మృతి ధాతువును గుండెలో ప్రతిష్టించుకుంటాము. ఇది గాఢమైన ఉద్వేగం…ఈ ఎమోషన్ కి ఒకరూపం పుష్కర స్నానం.
మనసుల్లో విస్తరిస్తున్న ఎడారుల, ఆశల్లో మొలుస్తున్న ముళ్ళ మొక్కలు, ఊహల్లో అలుముకుంటున్న దుర్భిక్షాలవల్లనో ఏమో గోదావరిని చూస్తేనే ఒక మహదానందం.. ఏదో తన్మయత్వం…స్నానఘట్టం మెట్టుమీద నిలుచుండటమంటే మనుషులూ, గోదావరీ హద్దుగా గీసుకున్న ఆధీనరేఖమీదనో, చెలియలికట్ట నడుమనో ఆగి పరస్పరం గౌరవించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మెట్టుదిగితే ఒక చిరు స్పర్శ అనుభవమౌతుంది. నడుములోతు దిగితే ఆలల ఊగిసలాటలో చిన్న సయ్యాట అనుభూతిలోకి వస్తుంది. అపారమైన జలరశులను చూస్తే అణగారిపోయిన ఆర్ద్రతలు
చెమరుస్తున్నట్టు అనిపిస్తుంది.
మానవ కల్మషాలు ధరించిన గోదావరీ నమస్కారం