శాస్త్రాలు తెలుగులో రాస్తేనే అది విశ్వభాష అవుతుంది!!


29-8-2021

పండితుల పరిధిలో వున్న తెలుగు సాహిత్య / గ్రాంధికాన్ని పామరులు మాట్లాడుకునే వ్యవహారిక భాషగా సంస్కరించిన ఉద్యమ సారధి కీర్తిశేషులు గిడుగు వెంకట రామమూర్తి గారికి నమస్కరించుకుంటున్నాను.

వ్యవహారిక భాష వినియోగం విస్తృతమయ్యేకొద్దీ సామాన్యుల నుంచి రచయితలు, కవులు పెరిగారు. సాహిత్యం మరింతగా జనాలకు చేరువ అయ్యింది.

80 వ దశకం నాటికే 4 లక్షల శీర్షికల ( టైటిల్స్) తెలుగు పుస్తకాల వుండటం భాషాసాహిత్య వికాసానికి ఒక ఆనవాలు అనవచ్చు. తెలుగు రాష్ట్రల్లోనే, తెలుగువారిమధ్యనే వుండిపోయి, కృశించిపోతున్న తెలుగు పరిధి అవధి విస్తరించాలంటే రచన అంశం శాస్త్రీయవిజ్ఞానం, పరిజ్ఞానాల వైపు మళ్ళాలి!

తెలుగు భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు ,

ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి.

తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో కూడా చెప్పగలగితే, రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల సాహిత్యం నుంచి మేధస్సు, ఆలోచనల మౌలిక అంశాలు కూడా చెప్పగల స్ధాయికి తెలుగు విస్తరించాలి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు పట్టు పెరగాలంటే మాతృభాషా మాధ్యమాలతోనే సాధ్యమని చైనా, జపాన్‌, ఐరోపా దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అమ్మభాషల్లో బోధిస్తూ జ్ఞానాధారిత ఆర్థికరంగ వృద్ధితో ఆయా దేశాలు దూసుకుపోతున్నాయి.

నవీన పరిశోధనల్లో, అత్యాధునిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వాటికి భిన్నంగా ఆంగ్లాన్ని నెత్తికెత్తుకున్న ఇండియాలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధిక శాతానికి విషయ పరిజ్ఞానం అరకొరేనని అధ్యయనాలెన్నో నిగ్గుతేల్చాయి. పిల్లలకు చిరపరిచితమైన భాషలను తరగతి గదిలోకి అనుమతించని దురవస్థ తొలగిపోతేనే విద్యార్థిలోకంలో సృజన నైపుణ్యాలు వికసిస్తాయి.

స్థానిక భాషల్లో వృత్తివిద్యా పదకోశాల నిర్మాణం, సంప్రదింపు గ్రంథాలతో సహా పాఠ్యపుస్తకాల సరళానువాదం, బోధన సిబ్బందికి తగిన శిక్షణలపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పట్టాలు పొందినవారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరింత ముఖ్యం. ఆంగ్లం, హిందీలకే పరిమితమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తేనే భిన్నత్వంలో ఏకత్వ భావన బలపడుతుంది.

‘విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే’నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు గొడుగుపట్టాలి!

యూనీకోడ్ ఫాంట్లు కంప్యూటర్ లో ప్రవేశించడం వల్లే ఇక్కడ ఇది నేను రాయగలిగాను. మీరు చదవగలుగుతున్నారు. తెలుగు స్పెల్,గ్రామర్ చెకర్ లు రూపొందించడానికి కేంద్రీయ విశ్వ విద్యాలయం గతంలో మొదలు పెట్టిన ప్రయత్నాలను పున:ప్రారంభించాలి. డిగ్రీదాకా తెలుగును నిర్బంధం చెయ్యాలి.

భాషావికాసం, ఔన్నత్యాలకు తెలుగురాష్ట్రాల్లో కనుచూపుదూరంలో అవకాశమే లేదు. ముస్లిం పాలకుల ప్రభావం వల్ల తెలంగాణాలో ఉర్దూ, హిందీ యాసలు కలసిన తెలుగు, ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు పదాలు కలసిన తెలుగు వర్ధిల్లుతున్నాయి.

తెలంగాణా నుడికారాన్ని కెసిఆర్ గారు అందిపుచ్చుకున్నారు. ఇతరులకంటే కాస్త లోతుగా జన హృదయాలలో చొరబడిపోడానికి అది వారికి దోహదమైంది. అయితే అది తెలంగాణా ప్రభుత్వ భాషా విధానంకాదు.

ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలోఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు

* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయించింది. మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది

* సంస్కృతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి

* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు

* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి

* ఉద్యోగాలకోసం నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి

* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు

* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు

* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు

* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది

* భాషఅంటే అది మాట్లాడే ప్రజలూ, చరిత్రా, సంక్కృతీ – ఇవన్నీ ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు.

* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?

* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?

* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?

• కవిత్వానికీ, కాల్పనిక సాహిత్యానికీ పనికొచ్చే తెలుగు భాషను శాస్త్రవిజ్ఞానాలను వివరించే భాషగా వికసింపజేసే ప్రయత్నాలు జరగనంతవరకూ తెలుగుభాషా ఉత్సవాలంటే ఖాళీ వేళల్లో సాంస్కృతిక ఉద్వేగంతో ఊగిపోవడమే! గిడుగు జయంతినాడు భాషావేత్తలను సత్కరించి చేతులు దులిపేసుకోవడమే!!

• తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికైతే తెలుగు భాషమీద ఎలాంటి ప్రేమా ఆసక్తీ లేవు! పైగా బతుకుదారి చూపించగలదన్న నమ్మకంతో ఇంగ్లీషును చిన్న బడి నుంచే నిర్భందం చేశారు. #nrjy #GodavariPost

ఇవి అమృత ఘడియలు…


డబ్బు ఇబ్బందులు వుంటాయి. ఆశలు సంతోషాలు వుంటాయి. కష్టాలు కన్నీళ్లు వుంటాయి. నిరాశలు నిస్పృహలు వుంటాయి.

మనిషికైనా ఇంటికైనా వీధికైనా రాష్ట్రానికైనా దేశానికైనా ఇదే జీవితం..ఇందులో పండగలు ఒక హుషారు ఊపు తెస్తాయి.

ఇంటికైతే జెండా కట్టుకోలేదు కాని నేను 75 ఏళ్ళ జెండా పండగలో వున్నాను. అంటే సంఘంలో ధోరణుల గురించి విలువల గురించి ధర్మాల గురించి ఆలోచనల్లో వున్నాను.
ఆశనిరాశలు మధ్య ఊగుతున్నాను.

అయినా నాకు ఆశ వైపే మొగ్గు వుందని నమ్ముతున్నాను.

పాలకులు (కాంగ్రెస్ / బిజెపి / తెలుగుదేశం / వైఎస్ఆర్ కాంగ్రెస్ – ఎవరైనా సరే) నిజాన్ని పూర్తిగా చూడనివ్వరు కళ్ళకు గంతలు కట్టేస్తారు. తమకు నచ్చినదానినే బూతద్దాలతో చూపిస్తారు. ఇందులో మోదీ / జగన్ తక్కువా కాదు. ఎక్కువా కాదు.

కొందరి ఓట్లకోసం అందరి డబ్బనీ పప్పూబెల్లాల్లా జగన్ పంచేస్తూండటం నచ్చడం లేదు. – ఇది అధర్మం

నచ్చకపోతే పాకిస్థాన్ పో అనే దుర్మార్గుల్ని మోదీ ఖండించకపోవడం అసలే నచ్చడం లేదు – ఇది అమానుషం, అనాగరీకం

మిగిలిందంతా ఒకే

మీకు స్వతంత్ర భారత అమృతోత్సవ శుభాకాంక్షలు!

——

ఎర్రకోటనుంచి ప్రధాని ప్రసంగాన్ని టివిలు వచ్చాక నేను ఎప్పుడూ మిస్ అవలేదు. రాత్రి హైఓల్టేజి వల్ల అడాప్టర్లు కాలిపోయాయి. రెండు టీవీలూ పనిచేయడంలేదు. (వేరేవాళ్ళ అడాప్టర్ తో చూస్తే రెండు టివీలూ పనిచేస్తున్నాయి) క్వాలిటీ కరెంటును సాధించుకోలేకపోయాము.

ఇందువల్ల ప్రధాని ఎర్రకోట అమృతోత్సవ ఉపన్యాసాన్ని మిస్ అయిపోయాను – తరువాత చూడవచ్చు ఏదైనా రియల్ టైమ్ లో చూసిన హుషారే వేరు.

వీరవాసరం… వాయిదా!


స్వాతంత్ర్య సమరయోధుడు నా తండ్రి కీర్తిశేషులు పెద్దాడ రామచంద్రరావు గారు పుట్టి పెరిగిన వీరవాసరంలో ఆయన ఒకప్పటి ఇల్లు, వీధులు, పొలాలు చూసి రావాలన్న కోరిక చాలా కాలంగా వుంది.

వీరవాసరంలో మా ఇలవేలుపు వున్నట్టు ఒక పురోహితుని భాష్యంద్వారా నా భార్య కనిపెట్టింది. ఆమెకు నమస్కారం పెట్టి రావాలన్నది తన కోరిక. ఇందుకు పసుపు కుంకుమ గాజులు చీరె రెడీ చేసింది.

వీరవాసరంంలో ఒక మిత్తుడిని ఫోన్ ద్వారా పట్టుకుని మా కార్యక్రమం చెప్పాను. ఆయన తప్ప నాతాతతండ్రుల ఊరిలో నేను తెలిసిన వారు ఎవరూ లేరు

సరే రండి. ఆ యోధుడి వారసుడిగా మీకు మా మిత్రబృందం చిరుసత్కారం చేసుకుంటాము అన్నారు.

జెండా పండుగ అయ్యాకే వీరవాసరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.

మాకు సత్కారాలు వొద్దు. కాయలు అమ్ముకోడానికి

“ఆ చెట్టు” మా ఇంటికే పరిమితం అనుకోవడం లేదు. నా తండ్రిగారికి ఆయన వ్యక్తిత్వం వల్ల రాజకీయాల్లో సమాజంలో గౌరవ మర్యాదలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొన్ని సార్లు అవమానాలూ జరిగాయి.

మాతండ్రిగారి విషయంలో వారసుసమైన నేను, తమ్ముడు సుధీర్ తృప్తిగా వున్నాము. మమ్మల్ని సత్కరించాలని మిత్రుడు అనుకోవడమే మా నాన్నగారికి మరోసారి సన్మానం జరుగుతున్నట్టు గా భావిస్తున్నాను.

వీరవాసరం తరువాత వెళ్తాము #nrjy

ఇది మతాతీత విశ్వాసం! 


ఇది మతాతీత విశ్వాసం! 
ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. 
జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 
పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 
జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 
మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.
మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  

పండగంటే!!!


గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో, కూతురివో, కొడుకువో, పనివాడివో, యజమానివో, దొరవో, వెధవవో…ఎవరివైనా సరే ఒక ఆర్బిట్ లో ప్రవేశించాక ఏ కక్ష్యలో పరిభ్రమణం వారిదే.

ఈ ప్రయాణంలో విసుగునీ, భారాన్నీ, విరక్తినీ తొలగించడానికో ఏమో, 
– ప్రయాసపడి భారాన్ని మోసేవారందరికీ ద్వారాన్నీ మార్గాన్నీ తానేనని దైవకుమారుడు ఇచ్చిన భరోసా…
– సర్వశక్తిమంతుడైన దైవం ఒక్కడే, మరే ఆరాధన అయినా అవిశ్వాసమే అన్న ప్రవక్త కనువిప్పూ…
– సర్వ సంశయాలూ విడిచి పెట్టి తననే శరణుకోరమని గీతాకారుడు ఇచ్చిన అండా…
మనిషి ఇచ్ఛను దేవుడి అధీనం చేయడానికి దారులు వేశాయి. 

ఇందుకు ప్రలోభంగా లభించే మనసు ప్రశాంతతా, వేడుక వాతావరణమూ పండగే! పండగే!!
కుడుములు లంచమిచ్చి, పనిముట్లు పూజలోపెట్టి ,కోర్కెలు తీర్చమనే వేడికోలు ఇంటిల్లపాదికీ సంబరమే!!

  

వల్లకాని నిశ్శబ్దం! 


అతి సున్నితమైన, అత్యంత సూక్ష్మమైన సంవేదనలను (senses) కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం గుర్తించడమూ ఒక విధంగా నిశ్శబ్దానికి భంగమే! 
పంచేంద్రియాల అనుభూతికి అందని మౌనమే నిశ్శబ్దం. 
కేవలం ఊపిరితీసుకోవడం విడిచిపెట్టడం మీద కాసేపు దృష్టి సారించగల ఏకాగ్రత అలవడింది కాని, నిశ్శబ్దంలో ఆనందం అనుభవమవ్వడం లేదు. ఈ సాధన చిన్న విషయం కాదు…అది నావల్లకాదు కూడా! 

కుదురులేని మనసు 


ప్రధానమంత్రి వ్యవస్ధమీద నాకు ఇప్పటికీ గౌరవం వుంది. నరేంద్రమోదీ గారి మీద ఎన్నో ఆశలు వుండేవి. రంగులతలపాగాలో ఆయన భారతీయత, ఆయన చేతులూపుతూ చేసే ప్రసంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు పట్ల కమిట్ మెంటు కనబడేది. 

ఆయనలోని వ్యాపార వర్గాల అనుకూలత ప్రజలకు ఉపయోగపడేదికాక, ఇబ్బంది పెట్టేది మాత్రమేనని ఏడాది అనుభవంతో అర్ధం చేసుకున్నాను. ఇది అర్ధమయ్యాక, (ప్రత్యేక హోదా పై ఆయన మోసం చేయడం వల్లకూడానేమో)…
ఇవాళ ఎర్రకోటలో అదే మోదీ, అదే తలపాగా, అవే చేతులు ఊపడం చూస్తూంటే 

ఎవరో సుప్రసిద్ధ ఇంద్రజాలకుడి మేజిక్ షో చూస్తున్నట్టు అనిపించింది. ఆయన కొత్తగా నినదించిన ‘టీమ్ ఇండియా’ ఏమాత్రం ఉత్తేజపరచలేకపోయింది. 

వెరీ వెరీ సారీ! 
శక్తి హీనుడైపోయిన చివరి మొఘలాయీ చక్రవర్తి కూడా అనేకసార్లు అడిగించుకుని కాని ఈస్టిండియా కంపెనీవాళ్ళ వ్యాపారానికి ఈ నేలమేద అధికారాన్ని ఇవ్వలేదు. అలా వేళ్ళూనుకున్న ఆంగ్లేయులను సాగనంపడానికి మన పూర్వీకులు మూడువందల ఏళ్ళు పాటు పడ్డాక హమ్మయ్య అనుకున్న 69 ఏళ్ళకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులూ పోటీలుపడి విదేశీకంపెనీలను ఆహ్వానించేస్తున్నారు. 
వ్యాపారఒప్పందాల్లో ప్రజలప్రయోజనమెంత?కార్పొరేట్ల లాభమెంత? ఈరెండింటికీ మధ్య హద్దుల్ని కట్టడి చేసేదెవరు? మొదలైన అంశాల్ని నరేంద్రమోదీ, చంద్రబాబు సహా ఏ ప్రభుత్వాలూ పారదర్శకంగా వుంచకపోవడం వల్ల మనపేదరికాన్ని దేశ,విదేశీ పెట్టుబడులకోసం అడ్డంగా తాకట్టుపెట్టేస్తున్నారనిపిస్తోంది. 
స్వేచ్ఛా స్వాతంత్రాలను ఐచ్ఛికంగా తాకట్టుపెట్టేస్తున్న నాయకులధోరణి కష్టంగా వుంది. అందుకని జెండాపండుగకు వెళ్ళకుండా ఇంట్లోనే వుండిపోయాను. ఒళ్ళుబాగోలేక ఒకసారి, మనసుబాగోలేక ఈవేళ మినహాయించి నేను జెండాపండగ చేసుకోని సంవత్సరమేలేదు. – జైహింద్ 

వృద్ధికి కేంద్రం – జీవితమా ? డబ్బా?


”గడవడమే కష్టంగా వుంది” అంది ఒక యువతి 

”డబ్బుసమస్య ఎవరికి లేదని, ఏదైనా ఆర్డర్ వస్తే పూర్తిచేసి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలీదు. అందాకా ఈడబ్బుతోనే సర్దికోవాలి”అని ఓ నలభైఏళ్ళ సీ్త్ర తన పర్సుని ఆయువతికి ఇచ్చింది. 
అందులో ఒక ఇరవై నోటు ఒక పదినోటు కాస్త చిల్లర చూసి ”నువ్వేనయం 

దేవుడి దగ్గర వెలిగించచానికి అగరుబత్తీ లేదు. రేపు తలస్నానానికి షాంపూ పేకెట్ లేదు. కొనడానికి డబ్బులు లేవు” అంది ఆ యువతి.
”ఉన్నదే సర్దుకుని తింటున్నాం. ఎప్పుడు ఏ అవసరం విరుచుకుపోతుందనే భయమే తప్ప బాగానే వున్నాము. అదేజీతం ఇదివరకు చివరి వారమే డబ్బులుండేవికాదు. ఇపుడు వారం పదిరోజుల తరువాత డబ్బు వుండటం లేదు” అని యువతి చెప్పుకొస్తోంది. డబ్బు ఇబ్బందే తప్ప ఎంతబాగా చూసుకుంటాడో అని మురిపెంగా చెబుతోంది. 
ఏదైనా జాబ్ చూడకపోయావా అంది ఆస్త్రీ 

నీలాంటి ముసలోళ్ళకే బయటికి వెళ్ళి పనిచేయడం సమస్య నేను వెళ్ళనే వెళ్ళను అనేసింది యువతి. 
ఇద్దరూ గట్టిగా నవ్వేసుకుని చేతులు పట్టుకుని కబుర్లాడుకుంటూ సంతోషాల్ని కలబోసుకున్నారు. ఒక అగరుబత్తీని ఎన్ని ముక్కలు చేస్తే అన్నిరోజులు దేవుడిముందు వెలిగించవచ్చిని ఆమె చిట్కా చెప్పగానే 

కదా అంటూ భలే డిస్కవరీ అన్నట్టు సంబరపడిపోయింది ఆయువతి. 
ఈసాయంత్రం ఇద్దరి మధ్య (ఖచ్చితంగా ఈ మాటలే కాదుకాని ఇంచమించు)ఈ సంభాషణల్నే విన్నాను. 
డబ్బులేదన్న ఆందోళన తప్ప జీవితం ప్రేమాస్పదం అనే ఎమోషన్ యువతిలో, సమస్యల్ని హాండిల్ చేసే నిబ్బరాన్ని సాధించిన సీ్త్రలో …పాజిటివ్ యాటిట్యూడ్ అద్భుతంగా కనిపించింది. వారు జీవితమే కేంద్రంగా బతుకుని వారు స్వీకరించి ఆస్వాదిస్తున్నారు. నాలాంటి లక్షలు కోట్లమంది డబ్బే కేంద్రంగా తృప్తి లేని బతుకును ఈడ్చేస్తున్నాము.
ఆ ఇద్దరూ ఆకస్మికంగా రెండు చీపురుకట్టలై పోయినట్టు భ్రమ కలిగింది. ధరలు అదుపుచేయలేక, సాంఘిక భద్రత ఇవ్వలేక, కష్టపడి జీవించే అడుగు మనిషికి ప్రశాంతతనూ, గౌరవాన్నీ హరించేసి కార్పొరేట్ ఊడిగపు వెర్రిలో మైమరచిపోతున్న పాలకులను చీపురుకట్టలు కోపంగా చూస్తున్నట్టు భ్రాంతి కలిగింది. డిల్లీనుంచీ అమరావతినుంచి దిగబడే స్మార్ట్ సిటిల్లో తమకు చోటెక్కడో తేల్చమని చీపురుకట్టలు నిలదీస్తున్నట్టు ఒక భావన ఆవరించింది. 
జీవన ప్రాధాన్యతలను తొక్కేసి మనుషుల్ని సింగపూరు డాలర్లకీ అమెరికా డాలర్లకీ ఎడాపెడా తాకట్టు పెట్టేస్తున్న విధానాల్ని తరిమెయ్యడానికి చీపురు కట్టల్ని తిరగెయ్యాలన్నంత కోపం కలిగింది.  
 

పిల్లలకు “పీడకలలు”లేని నిద్ర ఇవ్వడమే ఆయనకు నివాళి!!


ప్రముఖమైన లేదా విశిష్టమైన వ్యక్తికీ, గొప్ప వ్యక్తికీ తేడా వుంది. ఒక సామాజిక ప్రయోజనపు అంతస్సూత్రాలతోనే ప్రభావితమై కార్యాచరణకు దిగిన వారే గొప్ప వ్యక్తులు. సమాజంకోసం వారు అవసరాన్ని బట్టి కొరడా పట్టాలి, చీపురు పట్టాలి. వారే ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు. 

నాకుతెలిసినంతవరకూ ‘సత్యాగ్రహి’ గాంధీజీ, 

‘భారత సమాజాన్ని అర్ధం చేసుకోడానికి రిసోర్స్’ అంబేద్కర్ మహాశయుడు, 

‘మహా ఇన్ స్పైరర్’ కలామ్ సర్ లకు మించిన గొప్ప వారు లేరు. 
మనుషులు తమ జీవన సార్ధక్యం కోసం, సొంతబతుకుల నుంచి సమష్టి లోకి ఎదిగే విజయం సాధించడం కోసం అమాయకంగా, ప్రయత్నపూర్వకంగా కనే కలలగురించే, కనవలసిన కలల పరిచయం చేసింది ఆయనే!
కలలు…కలలు…కలలు కనండి…కలలు ఆలోచనలు అవుతాయి…ఆలోచనలు ఆచరణలు అవుతాయి అని పిల్లలకు నూరిపోసింది ఆయనే!
ఆరోహణ చివర ఒక శిఖరం వుంటుందనీ, చీకటి చివర వేకువలా కాచుకున్న జ్ఞానం వుంటుందనీ, కష్టపడి చేసే ప్రయాణం విజయగాధగా ముగుస్తుందనీ, విద్యార్ధుల్ని ప్రేరేపించింది ఆయనే!
స్వయం సిద్దుడైన ఆ విజయుడి కలల్ని నిజం చేయాలంటే, కఠిన వాస్తవాలనుంచి వెన్నల విజయాలు సాధించాలంటే పిల్లలకు పీడకలలు లేని నిద్రను ఇవ్వాలి అదే కలాం సర్ కి నివాళి! 
(ఉద్వేగం నుంచి మనసును ప్రశాంతతలోకి తెచ్చుకోడానికి గాంధీజీ మార్గంలో నేను ఈ పూట ఉపవాసం వుంటున్నాను) 

అమరావతి డిజైన్ రాజమౌళిగారికి అప్పగించండి!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి డిజైన్ల బాధ్యత రాజమౌళిగారికి అప్పగించాలని మనవి. ఇది వ్యంగ్యం కాదు. వెటకారం కాదు. సీరియస్ గానే చేస్తున్న విన్నపం. 

తెలంగాణా సోదరుల న్యాయమైన డిమాండ్ ప్రకారం రాషా్ట్రన్ని విభజించాలని మొదటినుంచీ కోరుకున్న కోస్తా ఆంధ్రుల్లో నేను ఒకడిని. సమైక్యతా ప్రదర్శనలు జరుగుతున్న కాలంలో నా పోస్టుల వల్ల సీమాంధ్రులతో బండబూతులు తిట్టించుకున్న ఫేస్ బుక్ వాళ్ళలో నేనొక ప్రముఖుడినే.😀😀(ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక ఇబ్బందులు వుండని విధంగా వాటాలు తేల్చకుండా రాత్రికి రాత్రే సామను బయటపడేసినట్టు చీల్చేసిన సోనియా కాంగ్రెస్ ను ఎప్పటికీ క్షమించలేను)
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వకార్యాలయాల నిర్మాణం కోసం 5000 ఎకరాల భూమిని 50:50 దామాషాలో డెవలపర్లకు ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఆఫీసు భవనాలు ఫ్రీగా వచ్చేస్తాయి. మిగిలిన సగం స్ధలాన్నీ డెవలర్లు అమ్ముకుని లాభాలతో సహా పెట్టుబడులు రాబట్టు కుంటారని అప్పట్లో ఒక పోస్టు పెట్టాను(ఇపుడు వెతికాను కానీ కనిపించడంలేదు) దాన్ని మిత్రులు వెటకారంగానే భావించారు. అప్పట్లో నన్ను సీమాంధ్రులు శత్రువుగా భావిస్తున్నందువల్ల నా భావనలో సీరియన్ నెస్ ని వివరించే ఓపిక లేకపోయింది. 
సీడ్ కేపిటల్…ప్లానర్…డిజైన్…చీఫ్ డెవలపర్…స్విస్ ఛాలెంజ్, కన్సార్టియమ్ లాంటి టెర్మినాలజీ వినిపిస్తున్నా, ఇపుడు జరిగిందేమిటి? డెవలప్ మెంటుకి ఇచ్చేయడమే కదా? అప్పుడు నేను స్ధూలంగా చెప్పింది ఇదేకదా? ఇందులో వెటకారం ఏమీ లేదుకదా? 
డెవలపర్ ఏంచేస్తాడు? తనకి తెలిసిన డిజైన్లే కదా వేసిఇస్తాడు. సింగపూర్ వాడు వాళ్ళ కళాదర్శకులతో అమరావతి బొమ్మలు గీయించి తెచ్చారు.ఇందులో తెలుగుతనం తేదని ఓఓఓ చించేసుకోవడంలో అర్ధముందా??
అమరావతిని సింగపూర్ లా కాకుండా అమరావతిని అమరావతిలాగే డిజైన్లు గీయడం మనవాళ్ళ వల్లే కుదురుతుంది. బీభత్స దర్శకుడు బోయపాటి శీను రాజమండ్రిలో గోదావరి హారతి వేదికను అందంగా తీర్చి దిద్దలేదా? 

ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి సింగపూర్ బొమ్మను చెరిపేసి తెలుగు అమరావతిని ఊహలకు ఎక్కించడం చిన్నవిషయం కాదు. బాహుబలిని నిర్మించిన రాజమౌళి గారికి ఇది మరీ కష్టం కాదు.
మరో ప్లానుతో ముఖ్యమంత్రి సింకయితే ఆడిజైన్ ప్రకారమే రాజధానిని నిర్మించేలా సింగపూర్ ని ఒప్పించడం అసాధ్యం కాదు. 
మనకి డబ్బులు లేవుగనుక రాజధానిని డెవలప్ మెంటుకి ఇవ్వడమే బెటరన్న అప్పటి నా సణుగుడు నిజమయ్యింది కదా! తెలుగుతనం, ఇండియా కూడా లక్షణం వుండేలా డిజైన్ మార్చడానికి ఎవరైనా భారీగా పూనుకోవాలంటున్న నా తాజా సణుగుడు కూడా నిజమవ్వాలని ఆశ ఇది వెటకారం కానేకాదని మనవి