నిజమైన పుణ్యక్షేత్రం!!


రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.

ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 

ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.

కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.

చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.

ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.

బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.

ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.

ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.

కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.

జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!

– పెద్దాడ నవీన్

జాతరలు…ఒక మతాతీత విశ్వాసం


(పెద్దాడ నవీన్)

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయమతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

ఇవాళ 14-2-2016 సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము

 జీవితాన్ని కలుషితం చేసుకున్న మనంనైతికతను కోల్పోయిన మనుషులంఅసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాంమనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 

పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని మహంకాళి తల్లి (చాలా మంది గ్రామదేవతలు రెండు, మూడు అడుగులకి ఎత్తుకి మించి వుండరు) ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 

జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయకోరుకొండ, వాడపల్లిఇలా ఎన్నెన్నో తీర్థాలు, తిరణాళ్ళుసంబరాలుఇవన్నీ మతంతో నిమిత్తంలేనివి ఇవన్నీ నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

 రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలోఅసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 

మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.

 మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇది మతాతీత విశ్వాసం! 


ఇది మతాతీత విశ్వాసం! 
ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. 
జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 
పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 
జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 
మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.
మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  

చైనా మాంద్యంలో ఇండియా లాభాలు! 


పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్ నాయకులు చైనా వెళ్ళడం అవసరం…మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేయడమే చైనా ఆర్ధిక సంక్షోభానికి మూలమని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గ్రహించడం కూడా మన ప్రయోజనాలకు అత్యవసరం.

http://www.telugu360.com/te/surat-diamond-blow-to-china-even-more-benefits-to-india/ 

  

త్రీడి సౌండ్ + హెచ్ డి పిక్చర్ = థ్రిల్లర్ ఎఫెక్ట్ 


ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వినిపించిన శబ్దం 
సకిలిస్తున్న ఒక డైనోసార్ నేను వున్నవైపు చిన్నగా నడిచి వస్తున్నట్టు అనిపించింది. 

అదిపాతిక అడుగుల ఎత్తున వున్న రెండంతస్ధుల భవనం స్లాబుమీదినుంచి తీసినఫొటో ఇది. రిన్నోవేషన్ కోసం బిల్డింగ్ లో ఫ్లోర్ ను పగలగొడుతున్నారు. పెద్దపెద్ద గదులనుంచి వస్తున్న రీసౌండు ఈదురుగాలులతో కలిసిపోయి ఎప్పుడూ వినని ధ్వనులు వినిపించాయి. 
ఎటుచూసినా దట్టంగా ఎదిగిన ముదురు ఆయిల్ పామ్ తోటలు.త్రీడి డిజిటల్ డాల్ఫీ సౌండ్ ఎఫెక్టుతో హైడెఫినిషన్ మూవీ చూస్తున్న యాంబియెన్స్ మల్లవోలులో ఈ బిల్డింగ్ దగ్గర వుంది. 
సాంప్రదాయికంగా మెట్టవరి, కందులు, పెసలు, మినుములు, నువ్వులు, వేరుశెనగ లాంటి వర్షాధార పైర్లు మెట్టనేలల్లో పండించేవారు. వాటికవే విస్తరించిన తాడిచెట్లు దట్టంగా వుండేవి. దీన్ని బట్టి కాస్త పోషిస్తే పామ్ జాతికి చెందిన కొబ్బరి, కోక్, ఆయిల్ పామ్ లాంటి తోటలకు అనువైన నేలలుగా గుర్తించారు. హెచ్చు ఎకరాలున్న పెద్దరైతులు తప్ప సగటు రైతులు కొత్త తోటల ప్రయోగాలు చేయలేకపోయారు. 
1997 పెనుతుఫానుకి కోససీమ కొబ్బరితోటలు ధ్వంసమయ్యాక పామ్ జాతి తోటల సాగు తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రగరప నేలలకు ఒక ఉద్యమంలా విస్తరించింది. అడవిలా పెరిగిన ఈ ఆయిల్ పాయ్ తోటల వయసు పదహారు పదిహేడేళ్ళే…
ఇది రాజానగరానికీ, అనపర్తికీ మధ్య మల్లవోలులో ఈరోజు ఉదయం నేను తీసిన ఫొటో 

  

పిచ్చుక లంక 


వందల సంవత్సరాలుగా గోదావరినుంచి ఇసుక, మట్టి రేణువులు పొరలు పొరలుగా ఏర్పడిన, ఏర్పడుతున్న అనేకానేక వరద మైదానాలలో ఇదొకటి. ఇది కాటన్ బేరేజి ధవిళేశ్వరం ఆర్మ్ కి కుడి చివర వుంది. వరదకాలంలో ఈ మైదానం మీద చిన్న చిన్న మేటలుగా పేరుకుపోయిన ఒండ్రుబురద ఎండకు ఎండీ మంచుకి మెత్తబడే దీర్ఘకాలిక ప్రక్రియలో నదికి అంచు/గట్టు/కట్టగా మారుతుంది. కుమ్మరి చక్రానికిఈ పా్రసెసే మూలం అనిపిస్తూంది. 

ఈ ఫొటోలో మధ్యలో కాలిబాట వున్న పుంతే గోదావరి గట్టు. కుడివైపు జిగురుగా వుండే చిత్తడి నేల. ఎడమవైపంతా పిచ్చుకలంక! గట్టునుంచి లంక పది మొదలు పదిహేను అడుగుల లోతు వుంటుంది. పొదలు, మొక్కలు చేట్లతో అలుముకున్న లంకలో ఆకుపచ్చతనమే తప్ప మట్టీ, నేలా కనిపించడం లేదు. దీని విస్తీర్ణం 48 ఎకరాలు. చాలా కాలంక్రితం రామానాయుడుగారు స్టూడియో కట్టడానికి పిచుకలంకను చూసి చాలదనుకునో ఏమో విశాఖకు వెళ్ళిపోయారు. రాజమండ్రిని రాషా్ట్రనికి టూరిజం హబ్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నాక ఇపుడీ లంక ఎలావుందో చూద్దామని ఒక మిత్రుడితో కలసి వెళ్ళాను. లంక చివర అద్భుతమైన దృశ్యం…అది గోధుమ రంగులో వున్న గోదావరి రేవులో స్నానానికి దిగుతున్నట్టున్న సూర్యుడిని ఎంత సేపు చూసినా విసుగురాని సంధ్య కాంతి.

ప్రశాంతంగా మెల్లిగా నడుస్తున్న నదిలోతు అక్కడ పాతిక అడుగుల పైమాటే!

చుట్టూ పురుగుపట్టి ఎండిపోయిన దొండపాదులు. చూస్తూండగానే రెండు జెర్రిగొడ్లు మెత్తగా పాక్కుంటూ పొదల్లోకి పోయాయి.చెవుల నిండా కీచురాళ్ళు, కీటకాల నిర్విరామ సంగీతం. లంకనిండా తాచులు, జెర్రిగొడ్లే వున్నాయి. వాటినితొక్కితే తప్ప ఏమీ చేయవు. నేలంతా తెల్లిసర మొక్కేకదా పాము పౌరుషాన్ని చంపేసింది అని పాండు చెప్పాడు. 3/4 పాంటు చేతిలో కర్రవున్న పాండుది బొబ్బర్లంక ఇతనికి సొంత బైక్ వుంది. సెల్ ఫోన్ వుంది. ఇతను ఒక కౌలు రైతు కొడుకు. ఏమీ చదువుకోలేదు. డ్యూటీకి రాగానే చొక్కావిప్పేసి బైక్ డిక్కీలో దాచేస్తాడు. లంకలో సాయంత్రం దాకా గేదుల్ని మేపుకుని చొక్కాతొడుక్కుని గేదెల వెనుక నుండి బైక్ డ్రయివ్ చేస్తూ వాటిని ఇంటికి తోలుకుపోతాడు. 
   
    
   

జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర! 


మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అవవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది. ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను.

జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేతా్రలు, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల వల్ల ఒక ప్రాతిపదికను, ఆధ్యాత్మిక భావాల వల్ల తాపత్రయాలు వీలైనంత వొదిలించుకోవాలన్న తాత్వికతనూ, ఎంతోకొంత ప్రజలు నింపుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ ఎంతో కొంత భారతీయ సమాజపు భావజాలంలోనే వున్నాయి. 
తరం నుంచి మరో తరానికి ఈ భావాలను రీఇన్ ఫోర్స్ చేసుకోవడమే తీర్ధయాత్రల రద్దీ పెరగడానికి మూలం. గ్రామాల్లో ఆలయాలు ప్రత్యక్షంగా సంఘజీవనాన్ని పటిష్టం చేయడంతోపాటు ఊరి ఆరోగ్య సంరక్షణకు ప్రాధమిక కేంద్రాలుగా కూడా వుండేవి. ఇపుడు గ్రామాలు అంతరించిపోతున్నాయి. సమాచార, రవాణా వసతులు పెరిగే గ్లోబల్ వాతావరణం కళ్ళముందుకి వచ్చేసింది. చిన్నా చితకా అంతరించిపోయి మెగావే మిగలడం గ్లోబల్ లక్షణమే. ఆప్రకారమే సింహాచలం, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, తిరుమల లాంటి ”పెద్ద” ఆలయాలు చేసుకున్న పుణ్యం అంతా ఇంతాకాదు. బస్సులు, కార్లు, రైళ్ళు, విమానాలకు ప్రజల్ని ఈ ప్రాంతాలకు చేర్చడం మీదుండే ఇంటె్రస్టు అంతా ఇంతాకాదు. 
ఏమైతేనేమి పూజాక్రతువులనుంచి, ధార్మిక ఆలోచనలనుంచి, ఆధ్యాత్మిక చింతనల నుంచీ ప్రజలు భక్తి భావాలకంటే జీవితాల్లో నైతికతను నింపుకుంటున్నారనీ, నైతిక బలాన్ని సుసంపన్నం చేసుకుంటున్నారనీ అర్ధమౌతోంది. ప్రపంచాన్ని పరిచయం చేసుకోడానికి క్షణక్షణం అవకాశమున్న కమ్యూనికేషన్ యుగంలో మనుషుల అవగాహనలకు హేతుబద్దతే ప్రాతిపదిక కావడంలో ఆశ్చర్యం లేదు. ఆర్జిత సేవల విషయంలో సిబ్బందినీ అర్చకుల్నీ ప్రశ్నించే లక్షణం బాగా పెరిగింది. చెల్లించిన సేవలపై నిలదీయడనికి అది వారికి డబ్బు ఇచ్చిన ధీమా! 
ఎన్ని అసౌకర్యాలనైనా ఓర్చుకుని సహించే దిగువమధ్య తరగతివారు సర్వదర్శనం క్యూలలో అవసరమైతే ఎవరినైనా నిలదీయడానికి సంకొచించని నిర్మొహమాట స్వభావం ”ప్రశ్నించే” అలవాటు పెరుగుతోందనడానికి ఒక సంకేతం. బ్యాలెట్ బాక్సుల్లో ఈ ”ప్రశ్నలే” ఫలితాల అంచనాలను తారుమారు చేసేవని అర్ధంచేసుకోవచ్చు. 
ఆలయాలకు సకుటుంబాలుగా వచ్చే యాత్రికుల్లో చాలా సందర్భాల్లో టూర్ మేనేజర్లు ఆ ఇంటి గృహిణులు కూతుర్లు కోడళ్ళే. ఇది స్త్రీ స్వాభావికమైన మేనేజీరియల్ స్కిల్లే. 
ఇవన్నీ పక్కనపెట్టేయండి…రాశులుపోసినట్టు వుండే మనుషుల జీవన సౌందర్యం తీర్ధయాత్రల్లో తప్ప, ఆలయ సందర్శనల్లోతప్ప ఇంకెక్్కడ కనబడుతుంది? అసలు మనుషుల్ని మించిన దేవతలూ, దేవుళ్ళూ ఇంకెవరున్నారు? అందుకే దీన్నొక బ్రాండుగా, ఐకాన్ గా ”ముక్కోటి దేవతలు”అన్నారు.

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 


ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 

కోనల్ని వెతికి, కొండల్ని మొక్కి తెలియని చోటునుంచి ఒక అనుభవాన్ని తెంపుకువచ్చినట్టుంది. చూసిన ప్రతీదీ కొంచెంకొంచెంగానే ఆవిష్కారమైనట్టు వుంది. 
అనంత పద్మనాభస్వామి రూపంలో 1300 ఏళ్ళక్రితమే వెలిసిన నమ్మకానికి నాలుగువందల ఏళ్ళనాడే గుడికట్టించిన నిజాం మతాతీత లౌకికతత్వానికి గౌరవమేసింది.

మూసీనది పుట్టిన చోటుని చూడాలన్న ఉత్సాహంతో బయలుదేరాము. కానీ, ఎండలో రెండుమూడు కిలోమీటర్లు నడిచే సామర్ధ్యం చాలక నీరెండిపోయి పచ్చగడ్డి మొలిచిన రివర్ బెడ్ ని మాత్రం చూశాము. అక్కడున్నది వైష్ణవాలయం కాబట్టి సేవలు, తీర్ధప్రసాదాలు, దక్షిణలు పటాటోపంగానే వున్నాయి. వెళ్ళింది ఒకదారి, వచ్చింది మరోదారి. తారురోడ్లు బాగున్నాయి. చెట్లఎత్తు, సైజు ని బట్టి అనంతగిరి కొండమీద లోయలో వున్నవి మధ్యతరగతి అడవులు అయివుండాలనిపించింది. మెత్తటి కలప ఇచ్చే మానులు, పెళుసుగా విరిగే చిన్నవయసు చెట్లు ఎక్కువగా గనిపించాయి. 

జనావాసాల్లోకి ముందుగానే గ్రీష్మరుతువు చొరబడిపోయినా రుతుచక్రంలో ఇది ఆకులు చిగురించే వసంతరుతువే! ఈ శోభ అనంతగిరి మార్గంలో, పోయినవారం నాగార్జున సాగర్ వెళ్ళినపుడు ఆ అడవుల్లో కనిపించింది. 

నేలరాలి ఎండిపోతున్న ఆకుల పెళపెళలు చెప్పులు లేని పాదాలకు బాజాలతో స్వాగతం చెపుతున్నాయనిపించింది. పచ్చటి ఆకుల పసరువాసన కలగలసిన 
అడవిగాలిలో తెలియని పరిమళాలు ప్రయాణమంతటా గుండెను నింపుతూనే వున్నాయి. 

డబ్బుపెట్టి కొనుక్కునే సౌకర్యాలు సరే! ఇవి శరీరాన్ని కొంత సుఖంగా వుంచవచ్చు..కానీ, ఆనందం అనుభవమవ్వాల్సిందే. ఇది డబ్బుకి అందేదికారు. యాత్రలో కొంత ఆనందం దొరుకుతుంది. 

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి కి దూరంగా కృత్రమత్వంతో గిడసబారిపోతున్న మనుషుల్లో పంచభూతాల ప్రాకృతిక రూపాలైన కొండలు, కోనలు, తీర్ధాలు ఒక మార్ధవాన్ని నింపుతాయి. 

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 


మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంత సౌందర్యం! 


చివరాదాకా వెల్లడికాని మూలమలుపులో ఉన్నట్టుండి తెరుచుకున్న ఒక అద్భుతం…కళ్ళు విప్పార్చుకోడానికి ఒక ఇంద్రజాలం…మనసు వికసించడానికి ఒక కొత్తదనం…పునరావృతంకాని కాలంలా, సుపరిచితం కాని స్ధలంలా, పునరుక్తి కాని భాషలా, ప్రతిధ్వనించని ధ్వనిలా, చర్విత చరణం కాని జీవితంలా ఒక వండర్ లాండ్ కాలికి తగిలింది. 

ఇది ఎత్తిపోతల జలపాతం
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ దాటగానే గుంటూరు జిల్లా…మాచర్ల రోడ్డులో అక్కడికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతముంది. గత ఆదివారం మా ఇద్దరు పిల్లలు, భార్య, నేనూ నాగార్జున సాగర్ వెళ్ళినపుడు ఈ జలపాతాన్ని కూడా చూశాము. కొండెక్కే గేటుదగ్గర కారు టోలు పదిరూపాయలు తీసుకున్నాడు. రశీదంటే మిమ్మల్నవరూ అడగరు పోండి అని భరోసాయిచ్చాడు. ఆ ఘాట్ లో ప్రతీ మలుపూ ఎదర ఏమి చూస్తామోనన్న కుతూహలమే! ఎండిపోతున్నట్టున్న అతి చిన్న చిన్న తుప్పలూ పొదలే…చిట్టడివి అనడం కూడా పెద్దమాటేనేమో!
అయితే అది నల్లమడ అడవి…మనిషి కలుషితం చేసిన అరణ్యపు అంచు…లోయలోకి వెళితే, అడవి లోకి చేరగలిగితే పులులు, ఏనుగలు ఏమోకాని అన్ని అడవి జంతువులూ తప్పక వుంటాయి. 
చేరవలసిన చోటుకి చేరాము. ఎంటె్రన్స్ టికెట్ ఇచ్చేదీ, గేటుముందు నిలుచుని టికెట్ ని స్వైప్ చేసేదీ ఒకే మనిషి. బస్సులో, షేర్ ఆటోల్లో అక్కడికి చేరి గుంపులు గుంపులుగా వేచి వున్న మనుషులు ”ఒక్కడే పాపం” అని సానుభూతి చూపినవారే తప్ప ఏంటీ నాన్సెన్స్ అని చిందులు తొక్కిన వారు. ఒక్కరూ కనబడలేదు.
మట్టిమనుషులకూ, నాగరీకులకూ అదే కదా తేడా!
టూరిజం రెస్టారెంటు, గెస్ట్ రూములు, టాయిలెట్ల కాంటా్రక్టర్ల అసలు చెప్పుకోకపోవడమే మంచిది. తాజ్ మహల్ ముందు తాజ్ మహల్ బొమ్మలు అమ్ముకునే వారు హెచ్చు ఆదాయాల మీదే దృష్టి పెట్టి వుంచుతారు. వారివి తాజ్ మహల్ ఔన్నత్యం గురించి ఆలోచించే తీరుబాటు జీవితాలు కావు. టూరిస్టు కేంద్రాల వద్ద ఏ వ్యాపారమైనా అంతే…
అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి మల్టీనేషనల్ బ్రాండుల ఫుడ్ పేకెట్స్ అక్కడ చాలా వున్నాయి.అయితే మనుషులు మరీ ఇష్టారాజ్యంగా వుండకుండా కోతులు బాగానే కాపలా కాస్తున్నాయి. అడవంటే కోతుల ఆవాసమే. మనిషి పొడ సోకి వాటి పర్యావరణం దెబ్బతింది. అడవిలోకి వెళ్ళి ఆహారం సేకరించుకునే శ్రమను మరచి కేంటీనులోదూరి, మనుషుల చేతుల్లో వి లాక్కుని తినేసే గూండాయిజానికి పాల్పడుతున్నాయి.అయినా కూడా పోలీసులెవరూ లేకపోవడం మంచివిషయంగానే నాకుతోచింది.
తూర్పుకనుమలలో నల్లమల కొండలలో పుట్టిన చంద్రవంక నది ముటుకూరు అనే చోట పుట్టిందట చంద్రవంక నది. తుమృకోట అభయారణ్యాలలో కొండలపైనుంచి లోయలోకి దిగుతూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. పచ్చని కొండలమధ్యనుంచి సుమారు 70 అడుగుల ఎత్తునుంచి కిందకు దూకే చంద్రవంక నది లోయల్లో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. జలపాతాన్ని చూడడానికి వ్యూపాయింట్ ఉంది. అక్కడ నుంచి చంద్రవంక నది లోయలోకి దూకుతున్న దృశ్యాలు కనువిందు చేస్తే, ఆ నది వినిపించే గలగలలు వీనులవిందు చేస్తాయి. యతులు తపస్సు చేసుకునే ప్రశాంతమైన ప్రాంతం కాబట్టి యతి తపోతలము అనే పేరు క్రమంగా ఎత్తిపోతల అయిందని అంటారు. చీకటి పడకుండా అక్కడికి చేరుకోగలిగితే జలపాతం దూకే లోయ లోకి మెట్ల దారి ఉంది. అక్కడ దత్తాత్రేయస్వామి కోవెల దర్శించుకోవచ్చు. నది లోయలోకి దూకే చోట మొసళ్ళు వున్నట్టు బోర్డు హెచ్చరిస్తూంది. ఆ పక్కన సన్నటి నీటిపాయ ఉండి సమతల ప్రదేశం ఉంది కనుక పిల్లలు పెద్దలు నీళ్ళల్లో తడిసిపోవచ్చు.

అత్యంత కృత్రిమాలైన జలవిహార్ లూ, స్నోపార్కులూ, ఇవ్వలేని సహజమైన ఆనందాలను ఇలా…మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంతాలే కదా  ప్రసాదించేవి!
కొన్నైనా పరిచయం లేని సంతోషాలే కదా మనిషిలో జీవశక్తిని ఉత్సాహపరచేవి!!

  
 

పాటలేని రోద 


కుటుంబ సందర్భాలు, వ్యక్తిగత సమయాలు, బహుశ పసితనపు కలలకూడా మార్కెట్ అయిపోయాయని అర్ధమౌతోంది. నగర జీవితమంటే పాట లేని రొద అనిపిస్తోంది.

నిన్న ఒక ఐ కేర్ సెంటర్ లో వేచి వున్నపుడు అక్కడున్న 26 మందిలో 17 మంది టెక్టి్సంగ్ లోనో కాలింగ్ లోనో కనిపించారు. ఇన్ ఆర్బిట్ మాల్ లో ఒక ఫుడ్ కోర్టులో తండ్రి వాయిస్ కాల్ లో, తల్లి డేటా కాల్ లో, చిన్నారి ఎలకా్ట్రనిక్ కారు రేసులో, వారు తినవలసిన ఫుడ్ పిచ్చి చూపులతో…

ఇదంతా కనిపించని పరుగులా వుంది…ఇందులో సహజమైన ఆనందం ఏదో మిస్ అయినట్టుంది…ఇదంతా అనుభవంలా లేదు…ఏదో వెంపర్లాటలా వుంది.

నా భార్య అన్నట్టు ఒక జీవనశైలిని వ్యాఖ్యానించడానికి నేనెవరిని? నా చేతి దురదని మీరు మన్నించాలి

ఇపుడు ఒక మాట మీకు తప్పక చెప్పాలి…గోదావరి జిల్లాలను “అమరావతి”గా మార్చాలన్న ఆలోచన రాని చంద్రబాబుగారికి నేను రుణపడి వున్నాను.
గమనిక : నేను అభివృద్ధి నిరోధకుణ్ణికాదు… బిడ్డ ఎదుగుదల సమతౌల్య పౌష్టికాహారంతోనే తప్ప స్టెరాయిడ్స్ తో కాదన్నదే నా అరణ్య రోదన 

(హైదరాబాద్ లో రెండో రోజు ఆలోచనలు – బుధవారం శుభోదయం)