కేన్సర్ : ఏమిటి ఎందుకు ఎలా


కేన్సర్ అంటే ఏంటి?

అపారమూ, అసంఖ్యాకమైన కణాల సముదాయమే మానవ దేహం.

శరీరం లోపలి భాగాల పెరుగుదల, వాటి పని సామర్ధ్యం కణాల చైతన్యం మీదే ఆధారపడి వుంటుంది.

నిరంతర చైతన్య ప్రక్రియలో వున్న కణాలు నశిస్తాయి. కొత్త కణాలు పుడుతూ వుంటాయి

కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వల్ల, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, అవసరానికి మించిన కణాలు పుట్టవచ్చు. అవి పూర్తిగా ఎదగకుండా మిగిలిపోయినపుడు “కంతి” గా స్థిరపడతాయి. వీటిని ట్యూమర్లు అంటాము.

స్వభావాన్ని బట్టి వీటిని బినైన్ ట్యూమర్ అనీ, మెలిగ్నంట్ ట్యూమర్ అనీ పిలుస్తారు.

మెలిగ్నంట్ ట్యూమరే కేన్సర్!

ఈ కేన్సర్ కణం ఏ శరీరభాగం నుంచైనా, ఏ కణం నుంచైనా మొదలవ్వవచ్చు! ఇది రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చుట్టుపక్కల వున్న ఇతర కణాలను నాశనం చేస్తుంది.

సాధారణ జీవకణాలు కేన్సర్ కణాలుగా ఎందుకు మారిపోతాయో ఖచ్చితంగా తెలియదు. జీన్స్ లో జరిగే కొన్ని మార్పులు ఇందుకు మూలం కావచ్చు.

రోజురోజుకీ మారుతున్న లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు ఇందుకు కారణం కావచ్చు!

వయసు పెరిగే కొద్దీ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువౌతున్నాయి.

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ కారకమైన “ కార్సినో జీన్స్ “ నుంచి రక్షణ పొందవచ్చు.

కేన్సర్ అంటే…

అంటు వ్యాధికాదు

ఏ విధంగానైనా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చేది కాదు.

మొదటి దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు

పొగ తాగవద్దు

ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చిన వారిలో 90 శాతం మందికి,

ఇతర కేన్సర్లు వచ్చిన వారిలో 30 శాతం మందికి పొగతాగడమే కేన్సర్ కారణమని, అధ్యయనాలు చెబుతున్నాయి.

కేన్సర్ వచ్చిన వారిలో 3 శాతం మందికి ఆల్కహాల్ అందుకు కారణం.

ఇందువల్ల చుట్ట బీడి సిగరెట్, లిక్కర్, సారా, స్పిరిట్ తాగడం ఆపెయ్యాలి.

పొగతాగే వారి పక్కన వుండే వారికి కూడా హాని జరుగుతుందని మరచిపోకూడదు.

పండ్లు కూరల నుంచి రక్షణ

కేబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయల్లో కేన్సర్ నుంచి రక్షించే గుణాలు వున్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం పెద్దపేగుల్లో కేన్సర్ ను కొంతవరకూ నివారిస్తుంది. “ఎ”, “సి” విటమిన్లు అధికంగా వున్న ఆహారపదార్ధాలు కేన్సర్ ను నివారించడానికి ఉపయోగపడతాయి. తాజాపళ్ళు, తాజా కూరగాయలు ఉన్న ఆహారం అన్ని విధాలా మంచిది.

బరువు తగ్గాలి

శరీర అవసరానికి మించిన బరువు కొన్ని రకాల కేన్సర్ కి దారితీస్తుంది. మితిమీరి తినడం మానుకోవాలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువుని తగ్గిస్తాయి. డాక్టర్ సలహాతో వీటిని అమలు చేయడం మంచిది.

కొవ్వు, మసాలాలు వద్దు!

వేపుళ్ళు, కారం, మసాలాలు ఎక్కువగావున్న ఆహారం వల్ల జీర్ణాశయం, ఆహారనాళాలకు కేన్సర్ సోకే అవకాశం వుంది.

చేప, చర్మం తీసిన చికెన్, మీగడలేని పాలు తీసుకోవడం మంచిది. కొవ్వుపదార్థాలు తక్కువగావుండే ఆహారం మంచిది.

వెస్ట్రన్ దేశాల్లో పెద్దపేగుల కేన్సర్ ఎక్కువ. వారు ప్రొటీన్లు ఎక్కువ, ఫైబర్లు తక్కువ వున్న ఆహారం తినడమే అందుకు కారణం.

మహిళలు – కేన్సర్

మనదేశంలో మహిళల కేన్సర్ అంటే అది గర్భాశయ కేన్సర్ లేదా రొమ్ము కేన్సర్ అయివుంటుంది.

లక్షణాలు

తెల్లబట్ట కావడం దీన్నే వైట్ డిశ్చార్జ్ అంటున్నాము.

బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం

బహిష్టు కాని సమయంలో రక్తస్రావం

లైంగికచర్య తరువాత రక్త స్రావం

ఎలాంటి స్త్రీలలో గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ?

చిన్నవయసులో పెళ్ళిజరిగినవారికి,

చిన్నవయసులో పిల్లలుపుట్టినవారికి,

హెచ్చుమంది పిల్లల్ని కన్నవారికి,

అల్పాదాయ వర్గాలవారికి,

గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఈ కేన్సర్ ను ప్రారంభదశకుముందు లేదా తొలిదశలో నిర్ధారించే అవకాశాలు వున్నాయి.

గర్భాశయం లోపలిగోడలను సూక్ష్మంగా పరిశీలించే సెర్వికల్ పాప్స్మియర్ టెస్టు ద్వారా కేన్సర్ రాగల అవకాశాలను కొన్నేళ్ళు ముందుగానే గుర్తించవచ్చు. అసాధారణమైన కణాలు ఈ పరీక్షలో కనబడినట్టయితే భవిష్యత్తులో కేన్సర్ రాగల అవకాశం తెలుస్తుంది. నివారణచర్యల ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు.

రొమ్ముకేన్సర్

50 ఏళ్ళుపైబడిన స్త్రీలలో, పిల్లలు పుట్టనిస్త్రీలలో, 12 ఏళ్ళ వయసుకిముందే మెనుస్ట్రేషన్ ప్రారంభమైనవారిలో, 35ఏళ్ళ వయసుదాటాక మొదటిబిడ్డ పుట్టిన స్త్రీలలో, అధికబరువు వున్నస్త్రీలలో, రక్తసంబంధీకులలో ఎవరికైనా రొమ్ముకేన్సర్ వున్న స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశంవుంది.

తొలిదశలోనే నిర్ధారించే పద్ధతులు

తమనుతామే పరిశీలించుకోవడం, డాక్టర్ వద్దకువెళ్ళి పరీక్ష చేయించకోవడం, మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ను మొదటిదశలోనే గుర్తించవచ్చు.

రొమ్ముకేన్సర్ ను మొదటేలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేసుకునే అవకాశం వుంది. రొమ్మును తొలగించే అవసరంరాదు.

స్వియ పరీక్ష

స్నానంచేసేటప్పుడు, శరీరం తడిగావున్మప్పుడు కుడి రొమ్మును ఎడమచేత్తో, ఎడమరొమ్మును కుడిచేత్తో క్రమపద్ధతిలో తడిమిచూసుకోవాలి.

మెన్సెస్ అయిన తరువాత వారంలోపులో ఈపరిశీలన చేసుకోవాలి. మెనుస్ట్రేషన్ ఆగిపోయినవారు నెలలో ఏదో ఒకతేదీ నిర్ణయించుకుని క్రమంతప్పకుండా ఇలా పరీక్షించుకోవాలి.

వక్షంలో కంతులు, వుండలు చేతికితగులుతాయి. ఇవన్నీ కేన్సర్ కారకాలు కావు. అయితే, క్రమంతప్పని పరిశీలనల్లో కంతులు వుండల లో పెద్దపెద్ద మార్పులు గమనిస్తే అపుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలి

అద్దంముందు నిలబడికూడా పరిశీలించుకోవచ్చు!

అద్దంఎదురుగా నిటారుగా, రిలాక్స్ డ్ గా నిలబడి భుజాలు దించి, చేతులు పైకెత్తివుంచి వక్షోజాల అరారంలో సైజులో మార్పులు వున్నాయో లేదో గమనించాలి. రొమ్ముల మీద ముడుతలు, సొట్టలవంటి మార్పులు వచ్చాయేమో చూసుకోవాలి.

వేళ్ళతో పరీక్ష

బొటనవేలు, చూపుడువేళ్ళతో చనుమొనలను నొక్కి ఏదైనాద్రవం వస్తూందా అని గమనించాలి! బిడ్డకు పాలు ఇస్తున్న తల్లికి ఈలక్షణం వుంటే ఫరవాలేదు. చనుపాలు ఇవ్వని స్త్రీలలో ఈలక్షణం వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.

జీర్ణాశయ కేన్సర్ కారకాలు

పొగతాగే అలవాటు, వేపుడుఆహారం, ఊరగాయపచ్చళ్ళు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు

జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు

ఆకలితగ్గడం, బరువుతగ్గడం, పొట్టలోనొప్పి, పొట్టనిండినట్టు, పొట్టబరువుగావున్నట్టు అనిపించడం, తేనుపులు, అజీర్ణం, వాంతులు…ఇవన్నీ జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు.

పరీక్షా పద్ధతులు

ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంలో కంతులు, పుండ్లను గుర్తించవచ్చు. బయాప్సీ అంటే చిన్నభాగాన్ని కోతపెట్టి పరీక్షకు పంపి నిర్ధారణ చేసుకోవచ్చు. రేడియేషన్ ద్వారా, మందులద్వారా, సర్జరీద్వారా జీర్ణాశయ కేన్సర్ ని నయంచేయవచ్చు.

నోరు మరియు గొంతు కేన్సర్

పొగాకు వాడకం, సిగరెట్, చుట్ట, బీడి, గుట్కా, ఖైని, పాన్, ముక్కపొడుం, లిక్కర్, ఆల్కహాల్, చుట్టను కాలుతున్న వైపు నోట్లో పెట్టికుని పొగపీల్టే అడ్డచుట్ట మొదలైనవాటివల్ల నోటికేన్సర్, గొంతుకేన్సర్ రావచ్చు.

లక్షణాలు

నోట్లో తగ్గనివాపు మాననిపుండు కంతి, ఎర్రని లేదా తెల్లనిమచ్చలు, మెడవద్ద బిళ్లలు, కంతులు, తగ్గనిగొంతుమంట, నోటిదుర్వాసన, గొంతుబొంగురుపోవడం, తరచుముక్కుదిబ్బడ, ముక్కునుంచి రక్తంకారడం, తినేటప్పుడు గొంతునొప్పి మొదలైన లక్షణాలు వుంటే అది గొంతుకేన్సర్ లేదా నోటికేన్సర్ అని అనుమానించవచ్చు.

(సంకలనం : పెద్దాడ నవీన్)

మూడేళ్ళకు మళ్ళీ కీచురాళ్ళ సంగీతం !


మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు సంగీతం, కీటకాల రొద మూడు సీజన్ల తరువాత ఇప్పుడే రౌండ్ పార్కలో వినిపించింది…మీ ఊళ్ళో కప్పల మేళం వినబడుతూందా అని సెల్లార్ లో తారసపడిన శ్రీరామపురం నుంచి వచ్చిన పాల అబ్బాయిని అడిగితే ఇంకెక్కడి కప్పలు చైనా ఎక్స్ పోర్ట్ అంటగా అనేశాడు. ముందుటేడాదే వానల్లో కప్పలగోల వినబడింది. నిరుడూ ఈ ఏడాదీ ఆ మోతే లేదు. చేను మీదకంటే ఇళ్ళల్లోనే దోమలు పెరిగిపోయాయని కూడా చెప్పాడు. 
  

నేలకోత


తేలికగా కోతకు గురయ్యే నేలలమీద కుండపోత వానల వల్ల నీటి జాలులు ఆకస్మికంగా వరదకాల్వలైపోతాయి. రాజమండ్రి దగ్గరలో చక్రద్వారబంధం అనే చిన్న ఊరిలో ఈ మధ్యాహ్నం కురిసిన భారీవానకు చిన్న వరద కాల్వే తయారైంది. రోడ్డు కింద నేలను కోసేస్తోంది. ఇది ఎర్ర ఇసుక నేలల వాలు ప్రాంతం. వాననీటిని నేలలోనే ఇంకిపోయేలా చూడటానికి పొలాలను మడులుగా విభజించి కరకట్టలు (గట్లు) వేసేవారు. వ్యవసాయానికి అడ్డుకాని కాలంలో తుప్పలు పొదలను యధేచ్చగా పెరగనిచ్చేవారు. అవి వానాకాలంలో నేలకోతను నివారించేవి. భూసారం కొట్టుకుపోకుండా ఆపేవి

ఇపుడు కంటికి విశాలంగా కనిపించేలా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం భూమిని చదునుచేసి వుంచుతున్నారు. ఫలితంగా చిన్నవానకే నేలకోత తప్పడంలేదు. ఎంతోకొంత భూసారం కొట్టుకుపోక ఆగడం లేదు.
  

ఎగిరిపోతే ఇంత బాగుంటుంది!


ఎత్తుతక్కువ అంచులు, తక్కువ కోత శక్తి, విస్తారమైన వరదమైదానాలు, వున్న నదులను వృద్ధనదులు అంటారు. ఆఫ్రికాలో నైలునది, పాకిస్ధాన్ లో సింధునది, ఇండియాలో గంగ,గోదావరులకు ఈ లక్షణాలు వున్నాయి. గోదావరి ఏడాదిలో ఆరు నెలలు ముదురు గోధుమరంగులో మూడు నెలలు లేత గోధుమరంగులో మూడునెలలు లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కలిసిన రంగులో వుంటుంది.

ఇవాళ ఈవినెంగ్ వాక్ సమయానికి వానతుంపరలు మొదలయ్యాయి. కారులో వాకింగ్ చేస్తూ చేస్తూ పుష్కరఘాట్ కి చేరుకునేసరికి నదిమీదుగా వీస్తున్న గాలి-నేలమీద కాళ్ళు వుంచే ఎక్కడికికో తెలిపోతున్న అనుభూతిని ఇచ్చింది అక్కడనిలబడితే చాలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుభవమౌతుంది. అప్పుడే ఫోన్ చేసిన ఒకఫ్రెండ్ మైల్డ్ గా గాలివీస్తున్న శబ్దం వినబడుతోంది ఎక్కడ అని అడిగారు. గోదావరి ఒడ్డున అని చెప్పగానే ఔనా అదేనా నన్ను తాకుతున్న హాయి అన్నారు. 

గోదావరి పక్కన వుండటమంటే అంత రొమాంటిక్ గా వుండటం! గోదావరి అంటే అంతటి భావుకత!!
ఫ్లడ్ లైట్ల వెలుగులో మెరుస్తున్న గోదావరి, నదికే నీరిచ్చే అడవులనుంచి కొట్జుకు వచ్చే ఖనిజలవణాలన్నీ నిరంతరం మేటలు పడుతూ పొరలుపొరలుగా సాగరంలోకి తరలిపోతూన్న వేళ పారదర్శకమైన నీటినుంచి నదీగర్భం గోధుమ రంగులో కనిపిస్తున్నట్టు అనిపించింది. 

 

భక్తి, శ్రద్ధల నదీ స్నానం!


కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను సృ్పశించే సామూహిక క్రతువే గోదావరి పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. నా ఉనికికి మా కుటుంబ ఉనికికి క్షేతా్రలు బీజాలు అయిన నా తల్లిదండ్రులు, అత్తమామలు, వారి పెద్దల పట్ల ఒక భక్తి శ్రద్ధలు వ్యక్తపరచడానికి తొమ్మిదోరోజు అయివుండటం వల్ల అన్న శా్రద్ధం పెట్టాను. పూర్వీకుల పేరు నిలబెట్టేది దానమో, ధర్మమో, సంతానమో కనుక ఏదో ఒకటి అయివుండాలి కనుక వారసుడిగా ఒక బాధ్యత నిర్వర్తించానన్న సంతృప్తి మిగిలింది.

గతరాత్రి చాలా సేపు పెద్దలతో నా కున్న జ్ఞాపకలు గుర్తువచ్చాయివారిపట్ల నేను అనుచితంగా ప్రవర్తించిన కొద్ది పాటి సందర్భాలు తలపునకు వచ్చాయి. క్షమాపణలు చెప్పడానికి వారెవరూ లేకపోవడం కొంత దు:ఖానికి కారణమైంది.ఈ ఉద్వేగం పేరు 

పరితాపమో పశ్చాత్తపమో! ఇలా హృదయాన్ని స్వచ్ఛపరచుకున్నాక నదీ స్నానంతో లౌకికమైన క్రతువుని కూడా పూర్తి చేయాలనిపించింది. 
సర్ ఆర్ధర్ కాటన్ గారికి నా తండ్రి పెద్దాడ రామచంద్రరావుగారికి ఇతర కుటుంబ పెద్దలకు పిండ ప్రధానాలు చేయాలన్నాను. కాటన్ గారిగురించి కొత్తగా చెప్పనవసరంలేదు. నాతండ్రిగారు యోధుడు,త్యాగి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించిన హీరో. మిగిలిన వారందరూ కుటుంబాలకు మూల స్ధంభాలు. అయితే ఈ ఆర్డర్ లో పిండప్రధానం కుదరదని బ్రాహ్మణుడు తేల్చేశారు. నాతండ్రి, ఆయన తండ్రి ఆయన తండ్రి, నా తల్లి…నా మామ ఆయన తండ్రి, ఆయన తండ్రి, నా అత్త…ఆతరువాతే కాటనైనా మరెవరేనా అని వివరించారు. రాజమండ్రి వచ్చి ఇతరుల సమన్వయలోపం వల్ల అన్యాయంగా పుష్కరాల్లో చనిపోయిన వారి కి కూడా పిండాలు వెయ్యడం వీలుకాలేదు. వారి కుటుంబీకులు ఇపుడు చావు మైలలో వుంటారు కనుక ఇపుడు వారికీ శా్రద్ధాలు పెట్టడం కుదరదు అన్నారు. 
గోత్రనామాల దగ్గర మళ్ళీ చిన్న హర్డిల్…నా గోత్రం చెప్పగానే జంధ్యం ఏదీ అని అడిగారు. మానాన్నగారు నాస్తీకుడు అయి వుండటం వల్ల నాకు వొడుగు చేయించని సంగతి చెప్పాను. సరే శూద్రుడికి చేసినట్టే చేస్తాను అన్నారు. మామగారి గోత్రం చెప్పినపుడు ఇంటర్ కేస్టన్నమాట అన్నారు. దీనికి రెమిడీ వుంది పుష్కరాల తరువాత కలవండి అదీ ముగించేద్దాం అన్నారు. సరే అన్నాను (ఇలా చాలాసార్లయింది. నేను వెళ్ళిందీ లేదు..వెళ్ళేదీ లేదు) 
ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారమే మా కుటుంబాల పెద్దలకు ఇతరుల కోటాలో కాటన్ గారికీ పిండప్రధానం చెశాను.
ఉనికి గీసిన గిరులు దాటి వ్యక్తిత్వాలను విస్తరించుకున్న మనుషులను కాలమే గుర్తుంచకుంటుంది. వారిముద్రలు అంత తేలికగా చెదరవు, చెరగవు.

బాటచేసిన వారినీ, దారిచూపిన వారినీ మరచిపోము. స్మృతి ధాతువును గుండెలో ప్రతిష్టించుకుంటాము. ఇది గాఢమైన ఉద్వేగం…ఈ ఎమోషన్ కి ఒకరూపం పుష్కర స్నానం. 
మనసుల్లో విస్తరిస్తున్న ఎడారుల, ఆశల్లో మొలుస్తున్న ముళ్ళ మొక్కలు, ఊహల్లో అలుముకుంటున్న దుర్భిక్షాలవల్లనో ఏమో గోదావరిని చూస్తేనే ఒక మహదానందం.. ఏదో తన్మయత్వం…స్నానఘట్టం మెట్టుమీద నిలుచుండటమంటే మనుషులూ, గోదావరీ హద్దుగా గీసుకున్న ఆధీనరేఖమీదనో, చెలియలికట్ట నడుమనో ఆగి పరస్పరం గౌరవించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మెట్టుదిగితే ఒక చిరు స్పర్శ అనుభవమౌతుంది. నడుములోతు దిగితే ఆలల ఊగిసలాటలో చిన్న సయ్యాట అనుభూతిలోకి వస్తుంది. అపారమైన జలరశులను చూస్తే అణగారిపోయిన ఆర్ద్రతలు 

చెమరుస్తున్నట్టు అనిపిస్తుంది. 
మానవ కల్మషాలు ధరించిన గోదావరీ నమస్కారం

అంతా ”కంటో్రల్” లోనే వుంది 


సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని విస్తృతంగా వినియోగిస్తున్న అతిపెద్ద ఈవెంటు గోదావరి పుష్కరాలే! 

ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో అధికారులు యధేచ్చగా స్మార్ట్ ఫోన్లు, టాబ్ లెట్ పిసిలు వాడుతున్నారంటే పాలనాయంతా్రంగంలో బాగా పెరిగిన ఐటి ప్రాధాన్యతని అర్ధం చేసుకోవచ్చు. 
ప్రతీఘాట్ కూ ఎస్ పి హోదాగల పోలీసు ఉన్నతాధికారులను ఇన్ చార్జ్ లు గా నియమించారు. పుష్కరఘాట్లతో సహా రాజమండ్రిలో ముఖ్యకూడలులను హైస్పీడ్ కనెక్టివిటీ వున్న కెమేరాలతో అనుసంధానం చేశారు.
పుష్కరఘాట్లు, సంబంధిత కేంద్రాల చుట్టూ పర్యటనలు, సమీక్షా సమావేశాల కాలాన్ని మినహాయిస్తే మిగిలిన సమయమంతా ముఖ్యమంత్రి సెంట్రల్ కంటో్రలు రూమ్ లోనే వుంటున్నారు. రాజమండ్రిని 360 డిగ్రీల కోణాల్లో ఎటుకావాలంటే అలా చూసే ఆపరేటర్ పనీ, ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుని నిర్ణయాలుతీసుకునే అధికారిపనీ, విధాననిర్ణయం చేసే నాయకుడి పనులతో చంద్రబాబు ఏకకాలంలో మూడు పాత్రలు పోషిస్తున్నారు. 
తొక్కిసలాటలో 27 మంది దుర్మరణం పాలైనతర్వాత షాకయినా త్వరలోనే తేరుకుని పరిస్ధితిని అధికారుల, నాయకుల జడత్వం నుంచి విడిపించి తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. పుష్కరయాత్రీకుల సదుపాయాలు, రక్షణ గాడినపడ్డాయనుకున్నాక ముఖ్యమంత్రి ఇతరవిధుల నిర్వహణ కూడా మొదలు పెట్టారు. 
పుష్కరయాత్రికుల నుంచి మూడు పద్ధతుల్లో నుంచి ఫీడ్ బేక్ తీసుకుంటున్నారు. ముద్రించిన సర్వే పేపర్లను యాత్రికులకు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, ఘాట్లతో లింక్ అయివున్న సెల్ టవర్ లలో కనిపించే మొబైల్ ఫోన్ నెంబర్లలో రాండమ్ గా నెంబర్లను ఎంచుకుని కాల్ చేసి ఫీడ్ బేక్ తెలుసుకోవడం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా యాత్రీకులే కాల్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం..టాయిలెట్లలో నీళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పారిశుద్యం తాగునీటి వసతి మెరుగుదలకు ఈ ఫీడ్ బ్యాక్ బాగా ఉపయోగపడిందని రోజుకి 50 వేలమందినుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని కంటో్రల్ రూమ్ అధికారి ఒకరు చెప్పారు. 
సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికీ, ప్రజలనుంచి సమాచారాన్ని అందుకోడానికీ గోదావరి పుష్కరాలను సోషల్ మీడియాలో అధికారులు ప్రవేశపెట్టారు. రాజమండ్రి మెయిన్ పోలీస్ కంటో్రల్ రూమ్ ను 9491235816 నెంబర్ ద్వారా వాట్సప్ తో అనుసంధానం చేశారు. ఇదే కంటో్రల్ రూమ్ ని @APPOLICE100 హేండిల్ తో ట్విట్టర్ కి కనెక్ట్ చేశారు. అలాగే @gpmmc2015 ట్విట్టర్ హేండిల్ నుంచి ఫేస్ బుక్ లో gpmmcrjy ప్రొఫైల్ నుంచి ప్రజలు గోదావరి మహా పుష్కరాల విశేషాలు తెలుసుకోవచ్చు. 

ఉల్లాసమై లోనికి పాకిన జనంసవ్వడి 


కోటిలింగాల రేవులో ఈ రోజుమధ్యాహ్నం మా చిన్నోడు, నా భార్య, నేను పుష్కరస్నానం చేశాము. వాతావరణం ఆహ్లాదకరంగావుంది.మనసుకి తృప్తిగా అనిపించింది. 
తిరుపతి నుంచి మిత్రుల రాకవల్ల మొదటి రోజు స్నానం తలపెట్టలేదు. ఆరోజు విషాదంవల్ల ఉత్సుకత పోయింది. రెండోరోజు గోదావరి స్నానం అన్నమాటే అనుకోలేదు. 

నాభార్యకు కాలిలో రక్తప్రసరణ కు సంబంధించిన సమస్య వుంది. పాతిక మీటర్లదూరం నడవాలన్నా కష్టమే. రామ్ నారాయణకి ఫోన్ చేసి తక్కువ దూరం నడిచే ఘాట్ ఎక్కడ అని అడిగితే, కారు మాఇంటి దగ్గర పెట్టి వెళ్ళొచ్చు అన్నాడు. నా భార్య కాలి సమస్య చెప్పినపుడు పాస్ వుందిగా బాగా దగ్గరగా వెళ్ళొచ్చు అన్నాడు…లేదులే అనగానే అయితే మేడమ్ ని టూవీలర్ మీద నేను దింపుతాను అన్నాడు. అవసరమైతే అడుగుతా అని చెప్పాను.
ప్రశాంతంగా స్నానం చేసే టప్పుడు కూడా ఈ ఫోన్ అవసరమా అని ఆవిడఅనగానే ఫోన్ కట్టేసి మంచంమీద పడేశాము.పాస్ కూడా ఇంట్లోనే వదిలేశాను. 
(పుష్కరాల కాలంలో అధికారులతో సమానంగా ప్రజల మధ్య వుండే రాజమండ్రి విలేకరులకు కూడా బంధు మిత్రులు వుంటారు. వారిని గోదావరి స్నానాలకు తీసుకు వెళ్ళడం కూడా బాధ్యతే కదా! గత పుష్కరాల్లో ఒకో విలేకరికీ ఐదుగురు చొప్పున వెళ్ళేలా విఐపి పాసులు ఇచ్చారు. ఈ సారి అలాగే పాస్ లు ఇస్తారని ఆశపడ్డాము. సబ్ కలెక్టర్ ని అడిగితే అసలు పాసులే లేవన్నారు…విఐపి పాస్ లు, వివిఐపి పాస్ లు ఆహోదా అవసరంలేని చాలా మంది దగ్గర కనబడుతున్నాయి. 
విలేకరులకి గతంలో లా విఐపి పాస్ లు ఇచ్చి వుంటే అన్నిపాస్ లమీదా కలిపి అన్ని రోజుల్లోనూ మహా అయితే రెండువేలమంది విఐపి ఘాట్ లలో స్నానం చేస్తారేమో! మూడుకోట్ల మంది స్నానం చేసే చోట ఈ రెండువేల మందీ ప్రజలకు మందీ భారమైపోతారా? విలేకరులకి ఈ పాటి ప్రివిలేజ్ ఇవ్వరా? ప్రభుత్వం తరపున పాస్ లు ఇచ్చిన సబ్ కలెక్టర్ గాని మంత్రులు గాని రాజమండ్రి మీడియాను విశ్వాసంలోకి తీసుకుపోకపోవడం, ఊరందరికీ విఐపి పాస్ లు ఇచ్చి, ఎవరికీ పాస్ లు ఇవ్వడం లేదని అబద్ధం చెప్పడం అవమానంగా బాధగా అనిపించి మేము, బంధు మిత్రులు ఘాట్ లకు వెళ్ళడానికి ఈ పాస్ వాడకూడదని నిర్ణయించుకున్నాను. ఇలాంటి సందర్భాల్లో,మనకి కూడా పాస్ లు వుండవా అని చిటపటలాడిపోకుండా ఇట్ హేపెన్స్ అని నవ్వేసే నా భార్యా పిల్లలకీ నేను ఎల్లవేళలా కృజ్ఞుడినే. వాళ్ళ సపోర్టే నా డిగ్నిటీని గౌరవాన్ని కాపాడుతూంటాయి)
మా సెంటర్ లో వుండే ఆటో డ్రయివర్ గోవింద్ తో వీలైనంత తక్కువగా నడిచే దూరం వున్న ఘాట్ కి తీసుకు వెళ్ళమన్నాము..పోలీసుల కంటపడకుండా ఇరుకు సందులు తిప్పుతూ బాగా దగ్గరగా తీసుకు వెళ్ళాడు. 
గోదావరి గట్టుకి ఆనుకుని వున్న కొటిలింగాల పేటంటే చిత్తడిగావుండే ఒండ్రు నేల. సామిల్లుల నుంచి పచ్చి కలపవాసన, నేలనుంచి కలప ధూళి మురిగిన వాసన, గాలివీచినపుడల్లా చిన్నగా సోకి ఆగిపోయాయి. గట్టు ఆవతల మహాజనసందోహాల సందడి రంగురంగుల ఉల్లాసంగా లోపలికి పాకుతున్నట్టు అనిపించింది.
అతి పెద్దదైన కోటిలింగాల రేవు చాలా చాలా చాలా బాగుంది. నిర్వహణ ఇంకా ఇంకా ఇంకా బాగుంది. ఇంత చక్కటి ఘాట్ ను ఇచ్చిన ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు. ఇంతటి సొత్తుని పుష్కరాలు ముగిశాక అందంగా ప్రయోజనవంతంగా నిలుపుకోవలసిన నిర్వహించుకోవలసిన బాధ్యత రాజమండ్రి పౌరసమాజానిదే
చాలా సేపు స్నానం చెశాము. తిరిగి వచ్చేటపుడు ఆటోకోసం ఎక్కువ దూరం నడవవలసి వచ్చింది. నా భార్య కాలి నెప్పితో చాలా సేపు అవస్ధపడింది. మంచిది కాదని తెలిసినా పెయిన్ కిల్లర్ వేసుకున్నాకగాని ఆమెకు నిద్రపట్టలేదు.
ఇవాళ కేవలం స్నానం చేసి వచ్చాము పుష్కర / తీర్ధ విధులు నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి మా పెద్దోడు వచ్చాక మరోసారి వెళ్ళాలి. ఈ రేవుకే వెళ్దామనుకుంటున్నాము.

పెళ్ళి సందడి 


పెళ్ళి సందడి 

సంసారాలతో తరలివచ్చిన టూవీలర్లని చిరునవ్వులతో ఆహ్వానిస్తున్నవియ్యంకుల కళ్ళలో స్వాగతం బోర్డులు మెరుస్తున్నాయి. అతిధుల మధ్యలో నిండు విస్తళ్ళలా పరచుకున్న వియ్యపురాళ్ళు పలకరింపుల్ని కొసరి కొసరి వడ్డిస్తూ మరి కాస్త తినండని మొహమాట పెడుతున్నారు. విసుగుని ఛేదించుకుని విరామంగా పెళ్ళికొచ్చినవారు నలుగురి మధ్య కొత్తతేజాన్ని పుంజుకుంటున్నారు. 

ఆ ఆవరణలో అమ్మాయిలు యాడ్ మోడల్స్ ని సినిమా స్టార్లని మించిపోయివున్నారు. కల్యాణమంటపం అప్సరసలు మెరిసిపోతున్న ఇంద్రసభలావుంది. ఆ ఏంబియన్సే నూతనోత్సాహాన్ని నరాల్లో పరుగులు తీయిస్తున్నట్టుంది. మళ్ళీ మళ్ళీ చిగురించే చెట్టులా జీవితం హుషారెక్కినట్టుంటుంది. 

మా కుటుంబ స్నేహితల పిల్లలైన బాలు, మంజు వివాహం రాజమండ్రి ఉమారామలింగ కల్యాణమంటపంలో జరుగుతోంది. ఇప్పటివరకూ  వుండివచ్చాము..ఇదంతా అక్కడి సీనే!!

ఇలా తెల్లారింది…


-ఎండ భలే సుఖం అనిపించిన శీతాకాలం వెనక్కిపోయి నీడ ఎంత సౌకర్యమో అనిపించే వేసవి ప్రభాత/ప్రభావ సమయం శరీరాన్ని గుచ్చుతున్నట్టువుంది.

-సీ్ట్రట్ ఫుడ్ అమ్మే బళ్ళు, కాకాహొటళ్ళు కిటకిటలాడుతున్నాయి

వీపుకి సంచులతో బైకులకు ఆనుకుని టిఫెన్లు తింటున్న మార్కెటింగ్ కుర్రవాళ్ళ గుంపులు

-క్లినిక్కుల తలుపులుతీస్తున్న ఆయాలు/సిబ్బంది

-దాదాపు అన్ని మందులషాపులూ తెరచే వున్నాయి

-ఫొటో స్టాట్ కాపీలు తీసే యూనిట్లు తెరచే వున్నాయి

-గుడుల్లో ప్రదక్షిణలు చేస్తున్న కొద్దిపాటి భక్తులు, బద్దకంగా పూజారులు కనబడ్డారు

-ఒక్క కిరాణా దుకాణం కూడా తెరచిలేదు

(ఇదిరాజమండ్రి-ప్రకాశంనగర్&దానవాయిపేట ల్లో16-3-2015 సోమవారం ఉదయం 8-30 సమయంలో నేను స్కూటర్ మీద ”మార్నింగ్ వాక్” చేసినప్పటి సన్నివేశాలు)

జీవనవైవిధ్యాన్ని మింగేసిన కొండచిలువ(హైవే ప్రయాణం)



చెట్లనీ, చేలనీ, చెరువుల్నీ, పశువుల్నీ, వీటన్నిటి ఆలంబనగా సాగే జీవన వైవిధ్యాన్ని  మింగేసి పడుకున్న కొండచిలవలా వుంది నేషనల్ హై వే . అపార్టు మెంటులో పడుచుపిల్లలు భయపెట్టీ బతిమిలాడీ మాకూ, కారుకీ పులిమిన హోళీ రంగులతో ఒంగోలులో బంధువుల ఇంట పెళ్ళికి ప్రయాణం మొదలైంది. 

రాజమండ్రి నుంచి ప్రారంభమైన ప్రయాణంలో ఐదోనెంబరు జాతీయ రహదారికి రెండువైపులా పట్టణాలకు గ్రామాలకు దగ్గరగా వున్న పొలాల్లో పచ్చదనపు ఆచ్ఛాదన పోయి నేల నగ్నంగా మిగిలుంది. మట్టితోపాటు చెట్లనీ తవ్వేసి నాటిన ఇసుకా సిమెంటూ బిల్డింగులై మొలుస్తున్నాయి. వాటికి ఎరువు అన్నట్టు ఉరు చివర్లలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు భూమిమీద పొరలు పొరలుగా పేరుకుపోతున్నాయి. ఊళ్ళకు దూరంగా వున్న నేలమీద పైర్లు వున్నా పౌష్టికాహారంలేని సోమాలియా పిల్లల్లా గిడసబారిపోయినట్టున్నాయి. 
వాటి పచ్చదనంలో కళాకాంతులు లేవు. చమురు కాలిన పొగ ధూళి పంటల్ని కమ్ముకున్నట్టు వుంది.

దారిపొడవునా జీవన వైవిధ్యం కాక మూసపోసిన జీవితమే ఎదురైనట్ట అనిపించింది. 
ప్రయాణంలో రెండువేపులా పొలాలు, చెట్లు వుండేవి. పొలాల్లో క్రిమికీటకాలు తినే పక్షులు చెట్ల మీద కాపురముండేవి. పశువుల గాయాల్ని క్లీన్ చేసే పక్షుల్ని వాటికి దురదొస్తే గోకే పిట్టల్నీ చూశాం.సువిశాలమైన పొలాలు పాడైపోయి, పెద్దపెద్ద చెట్లు లేకుండాపోయాక ఆధారంలేక పశువుల పక్షులు ఈ మార్గంనుంచి ఎటో వెళ్ళిపోయాయి. 334 కిలోమీటర్ల (రాజమండ్రిలో మా ఇంటి నుంచి ఒంగోలులో మేము దిగిన హొటల్ వరకూ వున్న దూరం) ప్రయాణంలో రోడ్డు పక్కన ఒక్క పశువు కూడా కనిపించలేదు. పొలాల్లో రైతులు కనిపించలేదు. టోల్ గేట్ల వద్ద విసుగూ విరామంలేకుండా నిలువుకాళ్ళ జపంచేసే గుమాస్తాలగానో , గార్డులగానో వేరుశెనక్కాయలు అమ్ముకునే సర్వీసు సెక్టారులోకో రైతులూ రైతు కూలీలూ డంప్ అయిపోయారనే అర్ధమైంది. 

హైవేలో రెస్టారెంట్లు లేవు వున్నా బాగోవు కాబట్టి ఇంట్లో చేసి తెచ్చుకున్న పులిహోర ఏ చెట్టుకిందైనా తినొచ్చని అనుకున్నాము. ఎంతదూరానికీ చెట్టే లేకపోవడం వల్ల ఆకలిక పెరిగిపోయి కారు ఓ పక్కగా ఆపి లోపలే కూర్చుని కడుపు నింపుకున్నాము. ఆశోకుడు అనగానే ‘చెట్లు నాటించెను’ అనే ఎందుకు చెబుతారో రోడ్ల పక్కన చెట్ల అవసరం ఏమిటో అనుభవమయ్యింది. 

ఆకులు రాలే శశిరరుతువులో పచ్చదనం షేడ్స్ మార్చుకుంటూ ఆకు ఆరెంజ్ రంగులోకీ, కాండం బూడిద రంగులోకి మారుతాయి. ఆకాశంలో కూడా ఈ రంగులే వేర్వేరు షేడ్స్ లో కనిపిస్తాయి. ప్రకృతితో జీవనం ముడిపడివుండటం ఇదే. ఎంతదూరం చూసినా ‘తెల్ల’ మొహం వేసుకున్న ఆకాశం పేలవంగా కనిపించింది.

కారు నడపడం నాకు మీద ఆసక్తి పెరగడం బాగానే నడపడం, కాలి బొటన వేలు గాయపడిన స్ధితిలో కూడా నా చిన్న కొడుకు బాగా డ్రయివ్ చేయడం, నా భార్య ఆమె కజిన్ చెల్లి ఏకధాటికగా ఇతర కజిన్లనురించి చెడూ, మంచీ ముచ్చటించకోవడం, పెళ్ళి కొడుకు ఇంట్లో, వాడి పిన్ని ఇంట్లో మర్యాదగా మాతో తెగతినిపించేయడం కూడా హోళీనాడు నన్ను పులుముకున్న రంగులే!